
రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
కర్నూలు(హాస్పిటల్): యువత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్ సూచించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్స్ కాలనీలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ‘సంవిధాన్ హత్య దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21వ తేది వరకు 21 నెలల పాటు కొనసాగిందన్నారు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధి అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సంవిధాన్ హత్య దివస్గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ను విడుదల చేసిందని చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో, రాజ్యాంగ దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నివాళులర్పించేందుకు, ప్రజలకు భారత రాజ్యాంగ విశిష్టత తెలియపరిచే అవగాహన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లా సాంస్కృతిక పర్యాటక శాఖ అధికారి విజయ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాశాంతి మాట్లాడుతూ.. ఎమర్జెన్సీతో అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ తన ప్రాబల్యాన్ని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ప్రధాన వక్త రమేష్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు మూడుసార్లు ఎమర్జెన్సీ విధించారని, అందులో రెండుసార్లు యుద్ధాల కారణంగా విధిస్తే 1975 జూన్ 25న ఇందిరాగాంధీ తెచ్చిన ఎమర్జెన్సీ చరిత్ర పుటలలో నిలిచిపోయిందన్నారు.