
ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు
కర్నూలు(సెంట్రల్): ఉన్నత చదువులు చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి 17 మంది విద్యార్థులను శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ సన్మానించారు. ఇందులో 600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన విద్యార్థులు ఏడుగురు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2,700 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కొందరు విద్యార్థులు మధ్యలో చదువు మానేసి వలసలు వెళ్లడంతో ఉత్తీర్ణత శాతంలో వెనుకబడినట్లు చెప్పారు. అయినప్పటికీ నాలుగు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 1,000 మంది విద్యార్థులు అధికంగా పాసైనట్లు చెప్పారు. పదో తరగతి తరువాత విద్యార్థులు మంచి కెరీర్ను ఎంచుకునేందుకు వీలుగా ‘నైపుణ్య’ అనే పేరుతో హైదరాబాద్ 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ద్వారా ఉచిత శిక్షణను ప్రారంభించామన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లోనూ ఉంచామని అవసరమైన విద్యార్థులు చూసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను సన్మానించి వారితో గ్రూపు ఫొటో దిగారు. కార్యక్రమంలో డీఈఓ శామ్యూల్పాల్, గురుకుల పాఠశాల కో ఆర్డినేటర్ శ్రీదేవి, ఏసీబీ డీఎస్పీ కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల నిర్వాహకుడు గణేష్, వెల్దుర్తి బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రిన్సిపాల్ సబీనా పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా