మహిళల నెట్బాల్ టోర్నీ ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): క్రీడల్లో గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా ముందుకు సాగాలని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మేరీస్ స్టెల్లా కళాశాల ఆవరణలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ (మహిళల) టోర్నీ శనివారం ప్రారంభమైంది. మంత్రి రాంప్రసాద్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలకు విజయవాడ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ కూన రాంజీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా ఉన్న 88 యూనివర్సిటీల నుంచి సుమారు వెయ్యి మంది క్రీడాకారులు, 200 మంది కోచ్లు, అధికారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు టోర్నీ జరుతుందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, స్టెల్లా కళాశాల ప్రిన్సిపాల్ ఇన్యాసమ్మ, యూనివర్సిటీ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మొదటి మూడు రోజులు నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయి. మైదానంలో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టుల్లో వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చి క్రీడాకారులు పోటీ పడ్డారు.
మహిళల నెట్బాల్ టోర్నీ ప్రారంభం


