
సత్వరమే అర్జీలు పరిష్కరించండి
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో ప్రజల నుంచి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్వోతో పాటు కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో కె.స్వాతి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు 146 అర్జీలను స్వీకరించారు.
అర్జీలు ఇవే
● సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వుల్లో సొంత మండల పరిగణనలోకి తీసుకోవడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇందుకోసం సరైన మార్గదర్శకాలు విడుదల చేసి బదిలీల ప్రక్రియ చేపట్టాలని సచివాలయ ఉద్యోగులు డీవీ భార్గవి, యూఎన్ జ్యోతి, సత్యనారాయణ, శ్రీనివాసరావు అర్జీ ఇచ్చారు.
● గూడూరు మండలం చిట్టిగూడూరు గ్రామానికి చెందిన మధిరి నాగభూషణం తన తండ్రి వెంకట్రామయ్య వీఆర్ఏగా పని చేస్తుండగా 1973లో డొంక పోరంబోకు భూమి 21 సెంట్ల భూమికి పట్టా మంజూరు చేశారని తెలిపారు. తాను కూడా వీఆర్ఏగా, అటెండరుగా పనిచేసి పదవీ విరమణ చేశానని ఎలాంటి పింఛను లేదని భూమిపై ఆధారపడి జీవిస్తున్న తనను లంకా చంద్రశీల అతని కుమారులు కలిసి భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేశారని పేర్కొన్నారు. ఈ విషయంపై గూడూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ ఇచ్చారు.
మీ కోసంలో 146 అర్జీలు స్వీకరణ డీఆర్వో చంద్రశేఖరరావు