
ముగిసిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంటీఎస్ (మినిమం టైం స్కేల్) ఉపాధ్యాయులకు బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్కు జిల్లా అధికారులు ఆదివారం సన్నద్ధమయ్యారు. అప్పటికే ఉమ్మడి కృష్ణాలో 115 మంది 2008, 150 మంది 1998 డీఎస్సీలకు చెందిన ఎంటీఎస్ టీచర్ల బదిలీల నిమిత్తం సీనియారిటీ జాబితాను జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. కౌన్సెలింగ్ కోసం డీఈఓ కార్యాలయానికి చేరుకున్న ఉమ్మడి జిల్లా ఎంటీఎస్ టీచర్లు ఖాళీలను పూర్తి స్థాయిలో ప్రదర్శించా లంటూ ఆందోళనకు దిగిన విషయం పాఠకులకు విదితమే. అనంతరం ఉమ్మడి కృష్ణాలోని 264 మందికి మొత్తం 644 పోస్టులు ఖాళీలు ప్రదర్శించడంతో టీచర్లు శాంతించారు. బదిలీల వెబ్ లింక్ సాయంత్రం వరకు రాకపోవడంతో ఉపాధ్యాయులు అసహనానికి గురయ్యారు. పొద్దుపోయాక ప్రారంభమైన బదిలీల్లో తొలుత 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆదివారం అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ జరిగింది. నిబంధనల మేరకు ఈ నెల 20 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండగా 22వ తేదీ నాటికి మొత్తం ఉమ్మడి కృష్ణాలోని 264 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీలు విద్యాశాఖ పూర్తి చేసింది.
అర్ధరాత్రి వరకు కౌన్సెలింగ్ టీచర్ల అసహనం