
దందాకు అండదండలు..
రెచ్చిపోతున్న రేషన్ మాఫియా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అధికారులు, కూటమి నేతల అండదండలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. ఇందులో కీలక పాత్ర టీడీపీకి చెందిన నియోజక వర్గ స్థాయి నేతలు పోషిస్తున్నారు. పోలీసులు, పౌరసరఫరా అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే కాకినాడ పోర్టుకు భారీగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారని తెలుస్తోంది.
రేషన్ షాపులు తెరిచిన వారం రోజుల్లోనే..
రేషన్ దుకాణాలను తెరిచిన వారం రోజుల్లోపే రేషన్ బియ్యం అక్రమ నిల్వలతో పట్టుబడి పలు షాపులను సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పలుచోట్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. దీంతో ప్రభుత్వం మాటలు బూటకమని తేలిపోయింది. నేరుగా రేషన్ డీలర్లే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో పాత్ర వహించడం విస్మయానికి గురి చేస్తోంది.
జిల్లాలో ‘రేషన్’ గ్యాంగ్
తిరువూరు, మైలవరం, నూజివీడుల్లో అక్కడి నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో రామచంద్రరావు అనే వ్యక్తి రేషన్ మాఫియాని నడిపిస్తున్నారు. వీరికి తోడుగా జి.కొండూరులో నిఖిల్, గొల్లపూడిలో సురేష్ పాతపాడులో రంగా, తిరువూరులో చారి తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. రేషన్ మాఫియా డాన్కు కొందరు సీఐలు సహకరిస్తున్నారు. కేతన కొండలోని ఓ రైస్ మిల్లులో రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరడం.. చర్యలకు ఉపక్రమించడంతో, పార్లమెంటు ప్రజా ప్రతినిధి కార్యాలయంలో ఉండే అక్రమాల ‘కిశోరం’ అడ్డుపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాకినాడ పోర్టుకు..
జగ్గయ్యపేట నియోజకవర్గంలో నాగరాజు, వత్సవాయి మండల పరిధి లింగాల గ్రామానికి చెందిన నరసింహారావు రేషన్ మాఫియాను నడిపిస్తున్నారు. ‘నందిగామ’లో వీరులపాడు మండలానికి చెందిన హరికృష్ణ, సత్యం, చందర్లపాడులో ఇద్దరు నరసింహారావులు, మాఫియాని నడిపించడంలో కీలకంగా ఉన్నారు. నియోజక వర్గంలో కీలక బాధ్యతలు చూస్తున్న వ్యక్తి వీరికి అండగా ఉంటున్నారు. విజయవాడ అజిత్సింగ్నగర్లో కోటేశ్వరావుతోపాటు, రూరల్, జక్కంపూడికాలనీలో టీడీపీ నేతలు దందాలో పాల్గొంటున్నారు. బియ్యం విస్సన్నపేట మీదుగా కాకినాడ పోర్టుకు వెళ్తున్నాయి.
ఈ నెలలో పట్టుబడిన ఘటనలు
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రేషన్ షాపు నంబరు 6లో రేషన్ పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఈ నెల 4వ తేదీన రెవెన్యూ అధికారులకు సమాచారం అందింది. వారు తనిఖీలు చేయగా 18బస్తాల బియ్యం అదనంగా ఉన్నట్లు గుర్తించి షాపును సీజ్ చేశారు.
● ఎ.కొండూరు మండల పరిధి కొత్తరేపూడి రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ చేసిన 34 బస్తాల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు ఈ నెల 8వ తేదీన స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం కనిపించకుండా మొక్కజొన్న విత్తనాలతో కలిపి ప్యాక్ చేసిన మిల్లు నిర్వాహకులు అధికారుల కన్నుగప్పే ప్రయత్నం చేసినా ఫలించలేదు.
● ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరులో రేషన్ పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్న నందిపాము వరప్రసాద్ అనే డీలరుపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి ఈ నెల 4వ తేదీన 6ఏ కేసు నమోదు చేశారు. స్టాకు రిజిస్టరు కంటే అదనంగా 162 కిలోల బియ్యం, 72 కిలోల పంచదార డీలరు వద్ద ఉన్నట్లు గుర్తించారు. విజయవాడ ఈస్ట్లో ఒకరు, సెంట్రల్ ఒకరు రేషన్ మాఫియాలో ఒకరు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
అక్రమార్కులది హైటెక్ జీవనశైలి
రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్న వారి వద్ద ఖరీదైన ఐ ఫోన్లు, ద్విచక్ర వాహనాలు, కార్లు ఉండటం పోలీసులనే విస్తుగొలుపుతోంది. ఈ వ్యాపారం చేస్తున్న వారు నెలకు రూ.10 నుంచి 20 లక్షల వరకూ సంపాదిస్తున్నట్టు తెలిసింది.
కీలక భాగస్వాములు.. పచ్చనేతలు, పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులే! బియ్యం వాహనాలతో అక్రమాలు అంటూ కూటమి విష ప్రచారం ఈ నెలలో పలుచోట్ల రేషన్ బియ్యం పట్టివేత మిల్లులకు తరలించి అక్కడ నుంచి పాలిష్ పట్టి బియ్యం అమ్మకాలు మరికొన్ని కాకినాడ పోర్టుకు తరలించి ఇతర దేశాలకు రవాణా
ఎక్కడికి తరలిస్తున్నారు
కృష్ణా
జిల్లాలో..
ప్రభుత్వం బూటకపు మాటలు
గత ప్రభుత్వం మొబైల్ వాహనాలతో ఇంటింటికీ రేషన్ ఇచ్చారు. వీటితో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ కూటమి ప్రభుత్వం విష ప్రచారం చేసింది. ఈ వాహనాలను తొలగించి పాత పద్ధతిలోనే డీలర్లకు బాధ్యతలు అప్పగించారు . రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే ఎండీయూ వాహనాలను రద్దు చేసినట్లు ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పింది.
చిన్నపాటి కేసులతో సరి
అక్రమ రవాణా ఘటనల్లో పట్టుబడిన వారు గతంలో పలుసార్లు రేషన్ బియ్యాన్ని అక్రమ సరఫరా చేసినవారే. పట్టుకున్నప్పుడలా చిన్న చిన్న కేసులు కట్టి వదిలేయడం మళ్లీ వారు అక్రమ వ్యాపారం చేయడం పరిపాటైంది. వీరిపై బలమైన కేసులు పెడితే ఇలాంటి పనులు చేయడానికి మిగిలిన వారు భయపడతారని కొంతమంది మేధావులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా అర్ధరాత్రి, తెల్లవారు జామున రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తుంటారు. ఆ సమయంలో ముందుగానే రెక్కీ నిర్వహించి తమకు అనుకూలంగా ఉన్న పోలీసులు ఉంటే వాహనాలను ముందుకు వెళ్లనిస్తారు. లేదంటే తర్వాత పంపిస్తారు. బియ్యం అక్రమ రవాణాలో పోలీసులకు ముడుపులు ముడుతున్నట్టు విమర్శలున్నాయి. ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోని మిల్లులకు తరలించి వీటిని పాలిష్పెట్టి కిలో రూ.35 నుంచి రూ.40కి బయట వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు తెలిసింది. కార్డు దారుల నుంచి కిలో బియ్యం రూ.10 కొనుగోలు చేసి, అక్కడ నుంచి మిల్లులకు కిలో రూ.18 కి అక్రమార్కులు విక్రయిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీ అవనిగడ్డలో 4.50 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి చెందిన కూతాడి వెంకన్న, అవనిగడ్డకు చెందిన కోసూరు రామారావుని అరెస్ట్ చేసి వారి వాహనాల నుంచి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని రేషన్ షాపులకు పంపిన బియ్యం సీలు కూడా తీయకుండా అలాగే అక్రమ రవాణా చేయడం కొసమెరుపు. గుడివాడ బైపాస్ రోడ్డులో ఈనెల 16న అక్రమంగా తరలిస్తున్న 17క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని అక్రమ వ్యాపారం చేస్తున్న కొత్తపేటకు చెందిన పెద్ది రామచంద్రరావు, వ్యాన్ డ్రైవర్ యండమూరి సీతారాముడుని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

దందాకు అండదండలు..

దందాకు అండదండలు..