నేడు యువత పోరు | - | Sakshi
Sakshi News home page

నేడు యువత పోరు

Jun 23 2025 6:55 AM | Updated on Jun 23 2025 6:55 AM

నేడు యువత పోరు

నేడు యువత పోరు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌)/లబ్బీపేట(విజయవాడతూర్పు): యువత జీవితాలతో కూటమి చెలగాటమాడుతోందని వైఎస్సార్‌ సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 23న నిర్వహించనున్న ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో కలిసి అవినాష్‌ ఆవిష్కరించారు. సోమవారం ఉదయం 10 నుంచి విజయవాడ అలంకార్‌సెంటర్‌లోని ధర్నా చౌక్‌లో యువత పోరు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

చంద్రబాబు సర్కార్‌పై నిరసన గళం

నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ చంద్రబాబు సర్కార్‌పై నిరసన గళం వినిపించేందుకు యువత పోరు ఏర్పాటు చేశారన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, అనుబంధ విభాగాల వారు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకూ నిరసనలు తెలియజేద్దామని పిలుపునిచ్చారు. యువత పోరు కార్యక్రమం అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఏడాది పాలనలో నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయిందన్నారు. వలంటీర్లు, ఎండీయూ వాహనాల నిర్వాహకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల యువజన విభాగం అధ్యక్షులు , పార్టీ ఇన్‌చార్జిలతో కలిసి యువత పోరుకు సమాయత్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు.

మచిలీపట్నంలో..

చిలకలపూడి(మచిలీపట్నం): వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం ఆధ్వర్యాన జిల్లా కేంద్రమైన మచిలీ పట్నంలో యువత పోరు కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు, జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మేరుగుమాల శ్రీకాళేశ్వరరావు ఆదివారం తెలిపారు. నిరుద్యోగులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నామన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన తెలిపి తర్వాత కలెక్టర్‌ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement