
మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): ‘మా కష్టాన్ని గుర్తించి న్యాయం చేయాలని’ ఎంటీఎస్ టీచర్లు కోరారు. మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఆదివారం జరగాల్సిన ఎంటీఎస్ టీచర్ల కౌన్సెలింగ్ను బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము 1998, 2008 డీఎస్సీలో అర్హత పొంది టీచర్లుగా పని చేస్తున్నామన్నారు. తక్కువ జీతంతో చేస్తున్న తాము ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ గోడు విని మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) రూ.32,470 వేతనంగా ప్రకటించి ఉమ్మడి జిల్లాలోని 265 మంది ఉపాధ్యాయులకు న్యాయం చేశారని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు తమను సుదూర ప్రాంతాలకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో దూర ప్రాంతాల్లోని ఖాళీలను మాత్రమే చూపి కౌన్సెలింగ్ నిర్వహించాలని చూస్తున్నారన్నారు.
నిబంధనను తుంగలో తొక్కుతున్నారు
గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లకు తక్కువ వేతనం కాబట్టి దగ్గర ప్రాంతాల్లోనే బదిలీ చేయాలని నిబంధనగా చేసిందని దాన్ని తుంగలో తొక్కే ప్రయ్నతం చేయాలని ఇప్పటి ప్రభుత్వం చూస్తోందని ధ్వజమెత్తారు. ఇతర ఉపాధ్యాయుల మాదిరిగా హెచ్ఆర్ఏ, డీఏలు లేవని ఓన్లీ టైమ్ స్కేల్లో పని చేస్తున్న తమకు నియర్ బై రెసిడెన్స్ ఉత్తర్వులను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ టీచర్లకు మ్యూచువల్ బదిలీలకు కూడా అవకాశం కల్పించాలన్నారు. తమలో దివ్యాంగులు కూడా ఉద్యోగులుగా చేస్తున్న వారు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని యథావిధిగా పని చేస్తున్న స్థానంలోనే కొనసాగించాలని కోరారు.
ఎంటీఎస్ టీచర్లు కౌన్సెలింగ్ బాయ్కాట్ కృష్ణా డీఈఓ కార్యాలయం వద్ద నినాదాలతో నిరసన