
‘దూర విద్య’తో ఆదరువు
మచిలీపట్నంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహిస్తోంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక సార్వత్రిక చదువులకు ఆదరణ తగ్గింది. 2024–25 అడ్మిషన్లు గతంతో పోలిస్తే భారీగా తగ్గాయి. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో కోర్సుల నిర్వహణకు 65 కేంద్రాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ కలిపి 2022–23లో 7,388 మంది చేరగా, 2023–24లో 8,945 మంది, 2024–25లో 7,020 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే అడ్మిషన్లు గతేడాది తగ్గాయి. అడ్మిషన్ల కోసం తత్కాల్ అవకాశం ఇచ్చినా ఏ మాత్రం పెరగలేదు. ఈ ఏడాది ఓపెన్ విద్యకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. గతేడాది తగ్గుముఖం పట్టిన ఓపెన్ విద్య అడ్మిషన్లపై ప్రభుత్వం దృష్టి సారించాలని, విద్యార్థులు సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.
రెగ్యులర్ కోర్సులతో సమానం..
అనివార్య కారణాలతో చదువులు మధ్యలోనే ఆపేసినవారు.. ఉద్యోగోన్నతుల కోసం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, నాల్గో తరగతి ఉద్యోగులు ఎక్కువగా ఓపెన్ విద్యలో చేరతారు. రెగ్యులర్గా పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివి ఎక్కువ సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు కూడా సార్వత్రిక విద్యవైపు మొగ్గు చూపుతారు. రెగ్యులర్ కోర్సులతో సమాన గుర్తింపు ఉన్నందున ఓపెన్ టెన్త్, ఇంటర్ కూడా విద్యార్థుల నుంచి క్రేజ్ ఉంది. అయితే గతేడాది విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య తగ్గింది.
విద్యాశాఖపై పెత్తనం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యాశాఖపై పెత్తనం మొదలైంది. కొంతమంది కార్పొరేట్ పెద్దలు సార్వత్రిక (ఓపెన్) విద్యను వ్యాపారం చేశారు. తరగతుల నిర్వహణ సవ్యంగా సాగలేదన్న విమర్శలూ ఉన్నాయి.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో..
రెగ్యులర్ కోర్సులకు దీటుగా సార్వత్రిక విద్యను సైతం పటిష్టం చేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంది. కేంద్రాల్లో తరగతుల నిర్వహణకు కూడా నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకటించింది. ఏపీ ఓపెన్ స్కూల్ నుంచి స్టడీ సెంటర్లుగా గుర్తింపు ఉన్న ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ సెలవు రోజుల్లో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. ఏడాదిలో తప్పనిసరిగా 30 థియరీ తరగతులు, ఇంటర్మీడియెట్ కోర్సు వారికి అదనంగా 20 ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేలా షెడ్యూల్ చేసింది. పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు అందేలా చర్యలు గత ప్రభుత్వం తీసుకుంది.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల వివరాలు..
విద్యాసంవత్సరం పదో తరగతి ఇంటర్మీడియెట్
2022–23 2,226 5,162
2023–24 2,986 5,959
2024–25 2,223 4,797
ఓపెన్ స్కూల్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి..
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంట ర్మీడియెట్ కోర్సులలో ప్రవేశాలకు జూన్ 12వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభించాం. జూలై 30తో దరఖాస్తులు స్వీకరణ ముగుస్తోంది. నిర్దేశిత ఫీజుతో పాటు అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు జూలై 31వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో ఆగస్టు 1వ తేదీ నుంచి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
– ఎం. డేవిడ్ రాజు,
అసిస్టెంట్ కమిషనర్, పబ్లిక్ పరీక్షలు
సద్వినియోగం చేసుకుంటే ఉన్నతికి సోపానం
రెగ్యులర్ కోర్సులతో సమానంగా
ఓపెన్ టెన్త్, ఇంటర్కు గుర్తింపు
ఏటికేడు తగ్గుతున్న అడ్మిషన్లు
కూటమి ప్రభుత్వం
పట్టించుకోవాలంటున్న విద్యావేత్తలు
రెండు జిల్లాల్లో 65 కేంద్రాల్లో
కోర్సుల నిర్వహణ
జూలై 30వరకూ దరఖాస్తులకు
అవకాశం