
రోడ్డున పడిన ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు
పెనుగంచిప్రోలు: కూటమి ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వలన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 వేల మంది ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు రోడ్డున పడ్డారని వైఎస్సార్ సీపీ ఎంపీపీల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మార్కపూడి గాంధీ అన్నారు. పెను గంచిప్రోలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్ణయాలను అక్కసుతో వ్యతిరేకిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా ఎండీయూ వాహనాలను అర్ధాంతరంగా తొలగించిందన్నారు. ఇప్పటికే 2.50 లక్షల మంది వలంటీర్లు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని, వంట ఏజెన్సీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఈ ప్రభుత్వం తొలగించిందన్నారు. ఎండీయూ వాహనాల సిబ్బందిని ఎటువంటి చర్చలు లేకుండా ఒక్క సంతకంతో తొలగించటం దుర్మార్గపు చర్య అని అన్నారు. గతంలో రేషన్ దుకాణాల వద్ద ప్రజలు పడిగాపులు పడటాన్ని చూసిన నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఎండీయూ వ్యవస్థ తీసుకొచ్చి ఇళ్ల వద్దనే రేషన్ సరుకులు అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో రేషన్ వినియోగదారులకు మళ్లీ తిప్పలు తప్పవన్నారు. రాబోయే రోజుల్లో తొలగించిన ఉద్యోగులే కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, నియోజకవర్గ ఎస్సీ సెల్, ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కీసర లోకేశ్వరరావు, మెండెం రామారావు, మండల సోషల్ మీడియా కన్వీనర్ నలబోతు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.