
అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చి సానుకూలంగా సకాలంలో పరిష్కరించాలని ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఇన్చార్జ్ కలెక్టర్తో పాటు డీఆర్వో కె. చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీ దేవి, ఆర్డీవో కె. స్వాతి, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
బదిలీల ప్రక్రియ ప్రారంభించండి..
తొలుత గీతాంజలిశర్మ మాట్లాడుతూ ఐ గాట్ కర్మ యోగి ఆన్లైన్ శిక్షణ తరగతుల కింద ఎనిమిది కోర్సులను ప్రతి ఒక్క ఉద్యోగి పూర్తి చేయాలని సూచించారు. ఈ శిక్షణ తరగతులపైన త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సమీక్ష జరపనున్నారని ప్రస్తుతం కృష్ణాజిల్లా 18వ స్థానంలో ఉందని ఈ నెల 20వ తేదీలోగా ఉద్యోగులు శిక్షణ తరగతులు పూర్తి చేసి జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, ఆ ఉత్తర్వుల్లో ఉన్న నిబంధనలను అనుసరించి వారి పరిధిలోని బదిలీల ప్రక్రియ వెంటనే చేపట్టాలన్నారు. మంగళవారం మీకోసం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించనున్నారని పెండింగ్లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. కోర్టు సెలవులు ఉన్నప్పటికీ జారీ చేసిన ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రతి చోట అంతర్గత కమిటీలను నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
క్రీడా సామగ్రి అందజేత..
క్రీడాకారుల కోసం 45 వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క శిబిరానికి రూ. 5 వేలు విలువ చేసే క్రీడా సామగ్రిని ఇన్చార్జ్ కలెక్టర్ చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. మీకోసంలో అధికారులు మొత్తం 157 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు.
ఇన్చార్జ్ కలెక్టర్ గీతాంజలిశర్మ ‘మీ కోసం’లో 157 అర్జీల స్వీకరణ
వచ్చిన అర్జీల్లో కొన్ని..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎంపీహెచ్ఏ (మగ) పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి పీహెచ్సీల నుంచి తప్పించి ఎన్వీపీడీసీపీ ప్రోగ్రాం నందు పనిచేసేందుకు రీడిప్లాయిమెంట్ ద్వారా సర్దుబాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎస్సీ కేటగిరీలోని అభ్యర్థులను నూతనంగా అమలు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రతినిధులు బి. కృష్ణ, జి. శీనయ్య, బి. మరియకుమార్ అర్జీ ఇచ్చారు.
మోపిదేవి భాస్కరరావు చెరువు నుంచి పాలకాయతిప్ప అవుట్ఫాల్స్ వరకు మేజర్ డ్రెయినేజీ కట్ట గండ్లు పడి ముళ్లతుమ్మ చెట్లతో మూసుకుపోయి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఈ గండ్లను పూడ్చి ముళ్ల చెట్లను తొలగించాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి ఆవుల బసవయ్య అర్జీ ఇచ్చారు.
మోపిదేవి మండలం కప్తానుపాలెం మండవ శ్రీలక్ష్మి అర్జీనిస్తూ.. తమకు గ్రామంలో 205/05, 6 సర్వే నంబర్లలో 30 సెంట్ల మాగాణి భూమి ఉందన్నారు. ఈ భూమికి సంబంధించి జాతీయ రహదారి నుంచి రాకపోకలు సాగించేందుకు 60 ఏళ్లుగా దారి ఉందని తెలిపారు. అయితే ముందున్న పొలాల వారు ఈ దారి గుండా రాకపోకలు సాగించేందుకు వీలు లేదని కంచె వేసి అడ్డగిస్తున్నారని, ఈ విషయంపై తాము మీ కోసంలో అర్జీ ఇచ్చి, పది నెలలుగా తిరుగుతున్నప్పటికీ న్యాయం జరగటం లేదని అధికారుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను పరిష్కరించాలని విన్నవించారు.