
ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు
గూడూరు: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై చిట్టిగూడూరు సమీపంలో ఆటో బోల్తా కొట్టిన ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మచిలీపట్నంలో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లడానికి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లికి చెందిన 15 మంది ఆటోలో బయలుదేరారు. ఆ ఆటో తరకటూరుపాలెం దాటిన తర్వాత అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ తాడిశెట్టి శివరామప్రసాద్, పునుగుపాటి కోటేశ్వరమ్మ, పునుగుపాటి వెంకటేశ్వరమ్మ, మోచర్ల బ్లెస్సీ, కామరవపు శ్రీరష్మ, మోచర్ల సుజాత, రామకోటి ధనుష్, మోచర్ల జాయి, మోచర్ల వెంకటేశ్వరరావు తదితరులు గాయపడ్డారు. గూడూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిరివాడలో వృద్ధురాలి దారుణ హత్య
హనుమాన్జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం సిరివాడ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలిని బుధవారం గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వృద్ధురాలి తలపై కత్తితో దాడి చేసి కిరాతకంగా హతమార్చాడు. గ్రామానికి చెందిన తలారి మేరీఫ్లోరెన్స్ (65) భర్త చనిపోవటంతో ఒంటరిగా జీవిస్తోంది. సంతానం లేకపోవటంతో ప్రశాంతిని గతంలో దత్తత తీసుకుంది. ఆమెకు ఆత్కూరుకు చెందిన గోపితో వివాహమైంది. భర్త గోపితో విభేదాలు రావడంతో ప్రశాంతి అతని నుంచి విడిపోయి 12 ఏళ్ల కుమారుడు రూపేష్తో కలిసి పుట్టింటి వద్దే ఉంటోంది. గోపి, ప్రశాంతి కాపురం నిలబెట్టేందుకు మేరీ ఫ్లోరెన్స్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గోపి నాలుగు రోజుల క్రితం సిరివాడ వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ప్రశాంతికి ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసి హనుమాన్జంక్షన్లోని ఆఫీసుకు రావాలని ఒత్తిడి చేశాడు. దీంతో భర్త గోపితో కలిసి ప్రశాంతి హనుమాన్జంక్షన్ వెళ్లింది. మనవడు రూపేష్తో ఉన్న మేరీ ఫ్లోరెన్స్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఆకస్మాత్తుగా ఇంట్లోకి చోరబడి కత్తితో తల, మెడ భాగాలపై విచక్షణరహితంగా దాడి చేయటంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో భయపడిన రూపేష్ కేకలు వేస్తూ ఇరుగుపొరుగు వారిని పిలిచాడు. వారు వచ్చేసరికి హంతుకుడు బైక్పై పరారయ్యాడు. ఈ ఘటనపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధు రాలి హత్యకు కారణాలపై పలుకోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ పేరిట ఫోన్ చేసిన వ్యక్తే గోపి, ప్రశాంతిని పథకం ప్రకారం బయటకు పంపి, మేరీ ఫ్లొరెన్స్ను హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. హనుమాన్జంక్షన్ సీఐ కె.వి.వి.ఎన్. సత్యనారాయణ, హనుమాన్జంక్షన్, వీరవల్లి ఎస్ఐలు సురేష్, శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం ద్వారా ఆధారాలు సేకరించారు.

ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు