
జూన్ మొదటి వారంలో బీచ్ ఫెస్టివల్
మచిలీపట్నంరూరల్: జూన్ మొదటి వారంలో నాలుగు రోజులపాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తా మని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. మంగినపూడి బీచ్ను మంత్రి బుధవారం సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. తొలుత ప్రవేశ మార్గంలో ఫిలిం ఆర్ట్ డైరెక్టర్ రమణ వంక ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాలను మంత్రి పరిశీలించారు. బీచ్కు వెళ్లే ప్రధాన రోడ్డును వెడల్పు చేసి మధ్యలో కూడలి ఏర్పాటు చేసి అక్కడి నుండి హెలిపాడ్ వరకు రహదారి నిర్మించాలని సూచించారు. ఉత్సవాల్లో భాగంగా బీచ్ కబడ్డీ, కయా కింగ్ జల క్రీడలను కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. పారా గ్లైడింగ్, హెలికాప్టర్ రైడింగ్, మోటార్ స్పీడ్ బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె.స్వాతి, మచిలీపట్నం వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, ఏఎంసీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, తహసీల్దార్లు హరి నాథ్, నాగభూషణం, సీఐ ఏసుబాబు, విద్యుత్ శాఖ డీఈ రామకృష్ణ, ఆర్ అండ్బీ డీఈ సంగీత తదితరులు పాల్గొన్నారు.