
తల్లిదండ్రుల కళ్లెదుటే కానరాని లోకాలకు..
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): తల్లిదండ్రుల కళ్లెదుట కుమార్తె కానరాని లోకాలకు వెళ్లిపోయింది. కొండపల్లి శ్రామికనగర్కు చెందిన తిరుమలకొండ వీరబాబు, సుచరిత దంపతుల కుమార్తె మహాలక్ష్మి(5) రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తిరువూరు సమీపంలోని వల్లంపట్ల గ్రామంలో ఆదివారం రాత్రి శుభకార్యానికి కారులో వెళ్లారు. సోమవారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఎ.కొండూరు వద్ద కారును ట్రక్ ఆటో ఢీకొట్టింది. కారులో కూర్చున్న మహాలక్ష్మి (5) మృత్యువాత పడింది. మిగిలిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరువూరు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె కళ్లెదుటే మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొండపల్లి తీసుకువచ్చిన బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల బాలిక మృతి