
జిల్లాలో 648 మి.మీ వర్షపాతం
గుడివాడరూరల్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం 648 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం కురిసిన వర్షాలకు పంట నష్టం తదితర వివరాలపై జిల్లాల వారీగా సమీక్షించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ గుడివాడ ఆర్డీవో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసిందని, బంటుమిల్లి మండలంలో 109.2 మిల్లీమీటర్లు, కంకిపాడు మండలంలో 56.2 మిల్లీ మీటర్లు, ఉయ్యూరు మండలంలో 52.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో 76 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, అందులో ముఖ్యంగా 64 హెక్టార్లలో అరటి తోటలు దెబ్బతిన్నాయని, కంకిపాడులో ఒక గేదె చనిపోయిందని కలెక్టర్ సీఎంకు వివరించారు.
సీఎం కాన్ఫరెన్స్లో కలెక్టర్ బాలాజీ వెల్లడి