
ధాన్యం విక్రయాలకు పోటెత్తిన రైతులు
అనుమంచిపల్లి(జగ్గయ్యపేట): గ్రామంలోని శ్రీ పద్మావతి శ్రీనివాసా పార్ బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీస్ వద్ద గురువారం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే జిల్లాలోని తిరువూరు, విస్సన్నపేట, నందిగామ, చందర్లపాడు, జగ్గయ్యపేట, మైలవరం మండలాల్లోని ఆయా గ్రామాల నుంచి రైతులు ధాన్యం అమ్మేందుకు ట్రాక్టర్లు, లారీలతో వచ్చారు. అయితే అప్పటికే రెండు రోజులుగా రైస్మిల్లులో ధాన్యం లోడుతో ఉన్న వాహనాలుండటంతో వాహనాలు లోపలికి వచ్చేందుకు యాజమాన్యం అనుమతించకపోవటంతో రైతులు, యాజమాన్యం మధ్య రెండు గంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధాన్యం బస్తాలతో వందల కి.మీ.ల దూరం నుంచి వచ్చామని, రెండు రోజుల క్రితం రావటంతో ధాన్యంతో ఇక్కడే ఉంటున్నామని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి అనుకూలమైన వారి వాహనాలను మాత్రం అనుమతిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పౌర సరఫరాల శాఖ డీటీ వెంకటేశ్వర్లు పోలీసుల సహకారంతో రైతుల, యాజమాన్యంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన రైతులకు సంబంధించి పౌర సరఫరాల శాఖ సైట్లో ఇబ్బందులు ఉండటంతోనే ఆలస్యమవుతోందని, అంతే కాకుండా మిల్లులో ఎస్ఏ గోడౌన్లకు సరఫరా చేయాల్సిన బియ్యం గోడౌన్ అధికారులు కొనుగోలు చేయకపోవటంతో రెండు నెలలుగా ఇక్కడే ఉంటున్నాయని, దీంతో రైతుల ధాన్యానికి చోటు లేదని యాజమాన్యం వివరణ ఇచ్చింది. వందకు పైగా లారీలు, ట్రాక్టర్లకు ధాన్యంకు పాసులు జారీ చేయటంతో వివాదం సద్దుమణిగింది.
అనుమంచిపల్లిలో రైస్మిల్లు వద్ద ఉద్రిక్తత
రెండు రోజులుగా ధాన్యం లారీలతో మిల్లు వద్దే మకాం మిల్లులో స్థలం లేదని యాజమాన్యం సమాధానం రంగప్రవేశం చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు రైతులకు పాసుల జారీతో సద్దుమణిగిన వివాదం

ధాన్యం విక్రయాలకు పోటెత్తిన రైతులు