
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆసిఫాబాద్అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో డీఎంహెచ్వో సీతారాంతో కలిసి బుధవారం వైద్యాధికారులతో మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, గర్భిణుల సంక్షేమంపై ముందస్తు ప్రణాళిక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలుషిత నీటితో వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన మందులు పీహెచ్సీలు, ఆశ, అంగన్వాడీ కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రసవాల కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. గురువారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభమవుతున్న దృష్ట్యా వంట సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికలు సమర్పించాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద విధులు నిర్వహించే వైద్యసిబ్బంది పీవీటీజీ గ్రామాన్ని సందర్శించాలని సూచించారు.
భూసమస్యల పరిష్కారానికి సదస్సులు
వాంకిడి: భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని అర్లీలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు. అర్జీదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మండల కేంద్రంలోని కేజీబీవీని తనిఖీ చేశారు. ప్రత్యేకాధికారి మీనాకు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ డి.కవిత, మండల సర్వేయర్ రామకృష్ణ, గిర్దావార్ మాజిత్, ఎస్సై ప్రశాంత్, సిబ్బంది పాల్గొన్నారు.