
గోడు చెప్పుకుని.. వినతులిచ్చి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. అధికారులకు గోడు చెప్పుకుని.. పరిష్కారం చూపాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆశ కార్యకర్తగా ఉపాధి కల్పించాలని ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్వాడీకి చెందిన సంగీత దరఖాస్తు చేసుకుంది. సాగు చేస్తున్న భూమికి పట్టాపాస్ పుస్తకం మంజూరు చేయించాలని దహెగాం మండలం ఇట్యాల గ్రామానికి చెందిన పూజారి బాయక్క అర్జీ సమర్పించింది. తన తాత పేరిట గల భూమిని ఇతరులు అక్రమంగా పట్టా మార్చుకుంటున్నారని, ఈ విషయమై న్యాయం చేయాలని బెజ్జూర్ మండలం బారెగూడ గ్రామానికి చెందిన భీమ్రావ్ దరఖాస్తు చేసుకున్నాడు. గత సంవత్సరం అగ్ని ప్రమాదంలో తన ఇల్లు కాలిపోయిందని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం కౌటగూడ గ్రామానికి చెందిన ఎడం లక్ష్మణ్ వేడుకున్నాడు. ఒంటరి మహిళ అయి న తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని కాగజ్నగ ర్ మండలం చింతగూడ గ్రామానికి చెందిన జోత్స్న కోరింది. తమ గ్రామంలో డీటీసీపీ అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన సోనులే సంతోష్బాబు ఫిర్యాదు చేశాడు. మున్సిపల్ రికార్డుల్లో తన తండ్రి పేరు తప్పుగా నమోదైందని, దానిని సవరించాలని ఆసిఫాబాద్ పట్టణం రాజీవ్నగర్కు చెందిన బండారి సత్యనారాయణ దరఖాస్తు సమర్పించాడు. అనంతరం అదనపు కలెక్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్రావ్, అధికారులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి
మా కుటుంబాలకు సొంతిల్లు లేదు. ప్రస్తుతం కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నాం. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదు. జీవనోపాధి కోసం ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాల్లో ఎక్కడైనా ఉపాధి కల్పించాలి.
– రాజేశ్వరీ, గౌతమి, కాగజ్నగర్
అనాథను.. ఆదుకోండి
రెబ్బెన మండలం గోలేటిలో ఉంటున్న నాకు ప్రస్తుతం ఎవరూ లేరు. అనాథగా కూలీ పనిచేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నా. ఉండేందుకు కనీసం ఇల్లు కూడా లేదు. ప్రభుత్వం దయతలచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– కళావతి, గోలేటి, మం.రెబ్బెన
●
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ

గోడు చెప్పుకుని.. వినతులిచ్చి

గోడు చెప్పుకుని.. వినతులిచ్చి