
రుచిగా.. నాణ్యతగా
● నేడు మధ్యాహ్న భోజన కార్మికులకు శిక్షణ ● వివిధ అంశాలపై తర్ఫీదు
ఈ నెల 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఆ లోగా పాఠశాలలకు ససంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల ఉపాధ్యాయులకు మండలస్థాయిలో ఐదు రోజులు శిక్షణ అందించారు. నూతన విద్యా విధానంపై అవగాహన కల్పించారు. ఇక విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంపై దృష్టి సారించింది. వంటలు రుచిగా, శుభ్రతతో ఉండేలా మధ్యాహ్న భోజన కార్మికులకు జిల్లావ్యాప్తంగా మంగళవారం శిక్షణ అందించనున్నారు.
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు ప్రభుత్వం మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. చాలాచోట్ల భోజనం నాణ్యత, రుచిగా ఉండడం లేదని తరచూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భోజనం విషయంలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా విద్యాశాఖ మరో అడుగు ముందుకేసింది. వంట, శుభ్రత, వడ్డింపు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పోషకాహారం అందించే తీరుపై అవగాహన కల్పించనున్నారు. జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేస్తు న్న ప్రభుత్వ పాఠశాలలు 980 ఉన్నాయి. ఇందులో 1,521 మంది మధ్యాహ్న భోజన కార్మికులు, స్కావెంజర్లు 798 మంది పనిచేస్తున్నారు. విద్యార్థులు సుమారు 70 వేల మంది ఉన్నారు.
ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో..
వంట చేసేందుకు సరైన వసతిలేని పాఠశాలల ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులకు శిక్షణ ముందుగా అందించారు. ఈ కార్యక్రమం రాష్ట్రస్థాయిలో ఈ నెల 4, 5 తేదీల్లో కొనసాగింది. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మంగళవారం ఉదయం 10:30 గంటలకు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వంట ఏజెన్సీ నిర్వాహకులకు ఆయా మండలాల్లో అవగాహన కల్పిస్తారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం భోజనం నాణ్యత, పోషక విలువలు ఉండేలా వడ్డించడం, వంట చేసే ప్రదేశంలో శుభ్రత, వడ్డించే విధానం తదితర అంశాల గురించి క్షుణ్నంగా వివరిస్తారు.
బడులకు వంటపాత్రలు
వంట తయారీకి నాణ్యమైన పాత్రలు వినియోగించాలనే ఉద్దేశంతో గతేడాది ప్రభుత్వం కొనుగోలుకు నిధులు విడుదల చేసింది. సెలవుల కంటే ముందుగా ఆయా పాఠశాలలకు వంట పాత్రలు పంపిణీ చేశారు. ప్రతినెలా 5వ తేదీలోగా మధ్యాహ్న భోజన బిల్లులు సమర్పించేలా దిశానిర్దేశం చేయనున్నారు. అసంపూర్తిగా ఉన్న వంట గదులను పూర్తి చేయాల్సి ఉంది. కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి స్టీరింగ్, మానిటరింగ్, మండలస్థాయిలో తహసీల్దార్ చైర్మన్ మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
నిసాని పాఠశాలలో వంట చేస్తున్న ఎండీఎం కార్మికులు(ఫైల్)
శిక్షణ వినియోగించుకోవాలి
మధ్యాహ్న భోజన కార్మికులతోపాటు ప్రధానోపాధాయ్యులకు మంగళవారం అందించే శిక్షణను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. పలు అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రధానోపాధ్యాయులు ఆయా పాఠశాలల వంట కార్మికులు వచ్చేలా చూడాలి.
– ఆడే ప్రకాశ్, ఎంఈవో, కెరమెరి

రుచిగా.. నాణ్యతగా