
ఫోన్ పోగొట్టుకున్నా.. పట్టేస్తారు!
● సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసుల ముందంజ ● ఉపయోగకరంగా సీఈఐఆర్ పోర్టల్ ● ఏడాదిలో 513 ఫోన్లు బాధితులకు అందజేత
సాక్షి, ఆసిఫాబాద్: మీ ఫోన్ పోగొట్టుకున్నారా?.. అయితే భయపడాల్సిన పనేం లేదు. వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయండి. సాధ్యమైనంత త్వరగా ఫోను మీ చేతికందేలా జిల్లా పోలీసులు చర్యలు చేపడతారు. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను పోలీసులు గుర్తించి రికవరీ చేస్తున్నారు. ఇలా కుమురంభీం జిల్లా పరిధిలో ఏడాది కాలంలో సుమారు 513 ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించారు. ఇవన్నీ రూ.10 వేల నుంచి రూ.40 వేల ఖరీదు చేసేవే.
పోర్టల్ ఇలా పనిచేస్తుంది..
మొదటగా సీఈఐఆర్ పోర్టల్ను ఆయా పోలీసు స్టేషన్లకు అనుసంధానించారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలోని సైబర్క్రైమ్ వింగ్ వీటన్నింటికీ నోడల్ కార్యాలయంగా పనిచేస్తోంది. ఈ పోర్టల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా(సీఐడీ) ఆధ్వర్యంలో నడుస్తోంది. పోగొట్టుకున్న బాధితులు.. తమ ఫోన్ నంబరు, ఐఎంఈఐ నంబరు, ఆధార్ కార్డు వివరాలతో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగానే.. ఈ వివరాలన్నీ సీఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తారు. కొత్త కార్డు వేయగానే.. ఆ వివరాలు పోర్టల్లో ప్రత్యక్షమవుతాయి. అవతలి వ్యక్తి ఎన్ని సిమ్లు మార్చితే, అన్ని వివరాలు కనిపిస్తాయి. సదరు ఫోన్ ఎవరి చేతిలో ఉంది.. ఏ రాష్ట్రంలో ఉందనే వివరాలన్నీ తెలిసిపోతాయి. పోలీసులు వాటిని రికవరీ చేసి కేసు నమోదైన స్టేషన్కు రప్పిస్తారు.
24 గంటల్లోనే ...
సీఈఐఆర్ పోర్టల్ను వినియోగించి ఫోన్లను రికవరీ చేయడంలో ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ ముందంజలో ఉంది. ఎవరైనా ఫోన్ పోగొట్టుకోగానే..ఆన్లైన్లోనూ ఎవరికివారే పోర్టల్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. కానీ తదనంతరం ఆ ఫోన్ వినియోగించే వారి వివరాలు తెలుసుకోవాలంటే నోడల్ కార్యాలయానికి వెళ్లక తప్పదు. అందుకే స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. గతంలో ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు నెల రోజులకు పైగా పట్టేది. పోర్టల్తో 24 గంటల్లోనే అవతలి వ్యక్తుల వివరాలన్నీ తెలుస్తున్నాయి. ఫోన్ పోతే బాధపడాల్సిన అవసరం లేదని, స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తే.. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి అందజేస్తామని ఆసిఫాబాద్ ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ పేర్కొన్నారు. సీఈఐఆర్ పోర్టల్ ఏర్పాటయ్యాక రికవరీ శాతం గణనీయంగా పెరిగిందన్నారు.
ఏడాదిగా సీఈఐఆర్ పోర్టల్లో నమోదైన ఫోన్లు 1,382
రికవరీ చేసి బాధితులకు
అప్పగించినవి 513
జిల్లా వివరాలు

ఫోన్ పోగొట్టుకున్నా.. పట్టేస్తారు!