
సర్కారు బడుల్లో సర్దుబాట్లు
● పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్లకు డిప్యూటేషన్లు ● జూన్12లోపు ప్రక్రియ పూర్తి
ఆసిఫాబాద్రూరల్: సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. జూన్ 12లోపు పాఠశాలల్లో అవసరమయ్యే సర్దుబాటు, దిద్దుబాటు చర్యలు పూర్తి చేయనున్నారు. తద్వారా జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నారు. విద్యాసంవత్సరం ఆరంభం నుంచే విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను సమీపంలో అవసరమైన పాఠశాలకు డిప్యూటేషన్ ద్వారా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సర్దుబాటు అధికారాలు కలెక్టర్లకు కట్టబెట్టారు.
సర్దుబాటు ఇలా..
జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 1 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి. 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు టీచర్లు, 151 నుంచి 200 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఆరుగురు ఉపాధ్యాయులు ఉండాలి. హైస్కూల్లో 200 మందిలోపు విద్యార్థులు ఉంటే ప్రతీ సబ్జెక్టుకు ఒక టీచర్, 201 నుంచి 250 మంది ఉంటే అదనంగా గణితం సబ్జెక్టుకు ఇద్దరు టీచర్లను కేటాయిస్తారు. గతేడాది డీఎస్సీ నియామకాలు, పదోన్నతులు జరిగినప్పటికీ జిల్లాలో 111 పాఠశాలలకు 108 మంది ఎస్జీటీలు, 28 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ఈసారి అంతకుమించి సర్దుబాటు అవకాశాలున్నాయి. దీంతోపాటు అప్గ్రేడ్ అయిన బడుల్లో పోస్టులు లేకపోయినప్పటికీ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యాశాఖాధికారి ప్రతిపాదిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఆమోదంతో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పని చేస్తున్న టీచర్లను మైదాన ప్రాంతాలకు సర్దుబాటు చేయడానికి వీలులేదు. మైదాన ప్రాంతాల్లో పని చేసే వారిని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ స్థానిక సంస్థల యాజ మాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి 729 ఉన్నాయి. వీటిలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు కలిపి 2,447 మంది టీచర్లు పని చేయాల్సి ఉండగా ప్రస్తు తం 2072 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నా రు. ఇంకా 375 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడా ది జిల్లా నుంచి 65 మంది స్పౌజ్ కేటగిరీలో ఇతర జిల్లాలకు వెళ్లారు.