
ఆదివాసీలు ఇబ్బందులు పడకుండా చూడాలి
ఆసిఫాబాద్అర్బన్: అటవీశాఖ నిబంధనలతో ఆది వాసీలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించాలని సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ఆదివాసీలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు గురువారం మద్దతు తెలిపి, కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం దీక్షా శిబిరంలో మాట్లాడుతూ అటవీ ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల కిందిస్థాయి సిబ్బంది పెట్టే ఇబ్బందులతో జిల్లా ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేదన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలోని పాపన్నపేట, గంగాపూర్ గ్రామాల్లో బోర్వెల్ వేసే పరిస్థితి లేదని, జిల్లా ఇన్చార్జి మంత్రి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. ప్రభుత్వం జీఓ నం.49 తీసుకొచ్చి టైగర్ రిజర్వుగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది అమల్లోకి వస్తే నిర్భందం మరింత పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్రిజర్వు ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు పట్టించుకోకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క దృష్టి సారించాలి
ఆదివాసీల రిలేదీక్షలో మాజీ ఎమ్మెల్యే కోనప్ప