
కౌమార బాలికలకు శక్తినిచ్చేలా..
● ఇందిరమ్మ అమృతం పథకానికి శ్రీకారం ● పైలట్ ప్రాజెక్ట్ కింద జిల్లా గుర్తింపు ● అంగన్వాడీల ద్వారా పోషకాలతో కూడిన ‘చిక్కీ’ల పంపిణీ ● జిల్లాలో 18,230 మంది గుర్తింపు
వాంకిడి: కౌమార దశలోని బాలికల ఆరోగ్యంపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఆడ పిల్లలకు శక్తినిద్దాం..ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం’ అనే నినాదంతో బాలికలకు పోషకాహారం అందించేలా ‘ఇందిరమ్మ అమృతం’ పథకాన్ని రూపొందించింది. రాష్ట్రంలోని 14 నుంచి 18 ఏళ్ల వయస్సు గల కౌమార దశ బాలికలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురవుతున్నారని గుర్తించి పోషకాలతో కూడిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేయనుంది. బాలికల్లో అత్యధికంగా రక్తహీనత కలిగి ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని పథకాన్ని ప్రయోగాత్మకంగా మే 29న ప్రారంభించారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగానికి విధి విధానాలను అప్పగించింది.
అంగన్వాడీల ద్వారా పంపిణీ..
జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 973 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 18,230 మంది కౌమార దశ బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఈ పథకం ద్వారా వీరందరికి పోషకాలతో కూడిన చిక్కీలు అందించనుంది. పథకంలో భాగంగా బాలికలకు ఆరోగ్యం, స్వయం ఉపాధి వంటి పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన అంశాలు..
● పోషకాహారం కింద పల్లీలు, చిరుధాన్యాలతో తయారు చేసిన చిక్కీలను అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలికలకు ఉచితంగా పంపిణీ చేస్తారు.
● రోజుకు ఒకటి చొప్పున నెలకు 30 చిక్కీలు ఇస్తారు. నెలలో రెండుసార్లు (15 రోజులకు ఒకసారి) పంపిణీ చేస్తారు.
● ఒక్కో చిక్కీలో సుమారు 600 కెలరీలు, 18–20 గ్రాముల ప్రొటీన్లు, అవసరమైన సూక్ష్మపోషకాలు ఉంటాయి.
జిల్లా వివరాలు
మండలం అంగన్వాడీ కౌమార
కేంద్రాలు బాలికలు
ఆసిఫాబాద్ 126 2,127
రెబ్బెన 69 1,125
తిర్యాణి 65 869
జైనూర్ 76 1,301
లింగాపూర్ 45 647
సిర్పూర్(యూ) 54 688
కాగజ్నగర్ 130 3,086
దహేగాం 43 833
బెజ్జుర్ 41 998
చింతలమానెపల్లి 43 1,080
పెంచికల్పేట్ 52 555
కౌటాల 52 1,240
సిర్పూర్(టి) 45 909
కెరమెరి 84 1,287
వాంకిడి 79 1,485
మొత్తం 973 18,230
18,230 మంది బాలికలకు అమలు
జిల్లాలో 18,230 మంది కౌమార బాలికలకు ఇందిరమ్మ అమృతం పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకాన్ని జిల్లాలో ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఈ వారంలో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తాం.
– భాస్కర్, ఐసీడీఎస్ పీడీ

కౌమార బాలికలకు శక్తినిచ్చేలా..