
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
జైనూర్: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. బుధవారం మండలంలోని లేండిగూడ ఏటవాలు వంతెనను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో ఫాగింగ్ మిషన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గర్భిణుల వివరాలు సేకరించి ప్రసూతి సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆస్పత్రుల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉపాధి హమీ పనుల్లో భూగర్భ జలాలు పెంచే విధంగా రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్రెడ్డి, ఎంపీవో మోహన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.