
విత్తన ఎంపికే కీలకం
● అధికారుల సూచనలు పాటించాలి ● విత్తనాలు అధిక ధరకు అమ్మొద్దు ● ‘నకిలీ’వి విక్రయిస్తే కఠనచర్యలు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఏడీఏ మిలింద్
ఆసిఫాబాద్రూరల్: పంటల సాగులో విత్తనాల ఎంపికే కీలకమని ఏడీఏ మిలింద్ సూచించారు. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానా లు పాటిస్తే అధిక దిగుబడులు సాధ్యమని పేర్కొన్నారు. రైతులు చిన్న వానలకే తొందరపడి పత్తి విత్తనాలు వేయొద్దని తెలిపారు. సరైన వర్షపాతం నమోదయ్యాకే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ అధికారు ల సలహాలు, సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందే అవకాశముంటుందని వివరించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వానాకాలం సాగుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు.
సాక్షి: జిల్లాలో ఈ ఖరీఫ్లో ఏయే పంటలు.. ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నాయి?
ఏడీఏ: జిల్లాలో 4,45,049 ఎకరాల సాగుభూమి ఉంది. 1.48 లక్షల మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్లో పత్తి 3,35,363 ఎకరాలు, వరి 56,861 ఎకరాలు, కంది 30,430 ఎకరాలు, పెసర, మినుములు, జొన్న, కూరగాయలు తదితర పంటలు 22,395 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
సాక్షి: విత్తనాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు మీరిచ్చే సూచనలు?
ఏడీఏ: రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. పంటకాలం పూర్తయ్యేదాకా దా నిని భద్రంగా దాచి ఉంచాలి. గ్రామంలోనే తక్కువ డబ్బులకు లూజ్ విత్తనాలు వస్తున్నాయని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయొద్దు. లూజ్ విత్తనాలు ఎవరైనా అమ్మితే వెంటనే మాకు సమాచారం ఇవ్వాలి.
సాక్షి: జిల్లాలోని కొన్ని దుకాణాల్లో పత్తి విత్తనాలు, యూరియా, ఇతర ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి?
ఏడీఏ: ప్రభుత్వం పత్తి ప్యాకెట్ ధర రూ.901 గా నిర్ణయించింది. ఎవరైనా ఇంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే మా దృష్టికి తీసుకువస్తే కఠినచర్యలు తీసుకుంటాం. యూరియాను రూ.266 విక్రయించాలి. కానీ.. కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్టు ఖర్చులు ఇవ్వడం లేదు. దీంతో ట్రాన్స్పోర్టు చార్జీ కింద అదనంగా రూ.20 వరకు మాత్రమే తీసుకోవాలి. ఎవరైనా ఇంతకంటే కంటే ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయాలి.
సాక్షి: ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు మీరిచ్చే సలహాలు ఏమిటి?
ఏడీఏ: రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ఎకరా పత్తి పంటకు రెండు యూరియా, ఒక డీఏపీ, ఒక పొటాష్ బస్తాలు సరిపోతాయి. పంటకాలంలో నాలు గుసార్లు వేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ మోతాదులో వాడితే పెట్టుబడి ఖర్చు పెరగడమే గాని అదనపు ప్రయోజనం ఉండదు. సేంద్రియ ఎరువులు వినియోగిస్తే, పంట మార్పిడి విధానం పాటిస్తే భూసారం పెరిగి అధిక దిగుబడి వస్తుంది.
సాక్షి: వరి నార్లు ఎప్పడు పోసుకోవాలి?
ఏడీఏ: నీటి వసతి ఉన్నవారు వరి నారు పోసుకో వచ్చు. ఆసిఫాబాద్ మండలంలో ప్రతీసారి వరిని ఆలస్యంగా సాగు చేస్తున్నారు. జూన్ చి వరి వారం లేదా జూలై మొదటి వారంలో వరి నాట్లు పూర్తయ్యేలా చూసుకోవాలి. సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు వేసి పూత దశలో కలియ దున్ని వరి నాటు వేసుకుంటే భూ మిలో సారం పెరుగుతుంది. పంటల దిగుబడి కూడా అధికంగా వస్తుంది.

విత్తన ఎంపికే కీలకం