
విత్తనంపై అప్రమత్తం!
● ‘నకిలీ’తో జాగ్రత్త ● తక్కువ ధరను చూసి మోసపోవద్దు ● రైతులకు సూచిస్తున్న అధికారులు
జిల్లాలో వానాకాలం సాగు అంచనా
తిర్యాణి: సాధారణంగా రోహిణి కార్తె ఆరంభంతోనే వానాకాలం సాగుకు సంబంధించిన సీజన్ ప్రారంభమైనట్లుగా భావిస్తాం.. అలాంటి రోహిణి కార్తె ప్రారంభమై దాదాపు వారం రోజులు కావస్తోంది. దీంతో రైతులు వానాకాలం పంటల సాగుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటికే మెజార్టీ రైతులు తమ వ్యవసాయ భూముల్లో దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు సిద్ధం చేసి ఉంచారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండడంతో పలు విత్తన కంపెనీలకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లో తిరుగుతూ తమ విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులను ఒప్పించే పనిలో నిమగ్నమయ్యారు.
జాగ్రత్తలు పాటించాలి
వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులు విత్తన ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే మొదటికే మో సం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని వివిధ మండలాల్లో వందల సంఖ్యలో నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు అధికారులకు పట్టుబడ్డాయి. ఈ నేపధ్యంలో విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి సరైన విత్తనాలు ఎంపిక చేసుకోవా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే నాణ్యత లేని విత్తనాలు, పేరు, ఊరు లేని వాటిని సైతం మంచివేనని అంటగట్టే కొందరూ వ్యాపారులు ఉంటారు. కాగా విత్తనాల స్థితిగతులను గమనించని రైతులు వాటిని కొనుగోలు చేసి ఏటా నష్టాలబారిన పడుతున్నారు. అంతేకాకుండా వర్షాలు కురియడం మొదలైందంటే చాలు అన్నదాతల్లో ఒకరకమైన హడావుడి మొదలవుతుంది. సమీపంలోని ఫర్టిలైజ ర్ షాపులతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుంటా రు. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు తక్కువ ధరకు నాణ్యతలేని విత్తనాలను అమ్ముతుంటారు. అయితే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు అస్కారం ఏ ర్పడుతుంది. కాగా క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు విత్తన ఎంపికపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటుగా వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకుండా ఉండేందుకు తరచూ ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నారు.
తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి
రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. లైసెన్స్ కలిగి ఉన్న డీలర్ వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలి. విత్తనాల ఎంపికపై క్షేత్రస్థాయిలో ఏఈ, ఏఈవోలు రైతులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
– జాడి మిలింద్ కుమార్, ఏడీఏ, వ్యవసాయశాఖ
పంటరకం ఎకరాలు
పత్తి 3,35,363
వరి 56,861
కంది 30,430
ఇతర పంటలు 22,395
ఎంపిక ఇలా..
ప్రభుత్వ అనుమతి ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి.
తక్కువ ధరకు వస్తున్నాయని ప్రైవేటు వ్య క్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దు..
విత్తనాల ప్యాకెట్పై లాట్ నంబర్, కంపెనీ పేరు, డేట్ ఆఫ్ ప్యాకింగ్, లేబుల్, విత్తన మొలక శాతం సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.
విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత షాపు నుంచి రశీదును పొందాలి.
గ్రామాల్లో తిరుగుతూ విత్తనాలు విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయవద్దు.
లూజ్ విత్తనాలకు దూరంగా ఉండాలి.
రశీదుతో పాటు విత్తన ప్యాకెట్ కవర్ను ఇంట్లో భద్రపర్చుకోవాలి. తద్వారా పంట నష్టపోయిన సమయంలో పరిహారం పొందేందుకు అవకాశం ఉంటుంది.
దుకాణాల్లో లేదా ప్రైవేటుగా నకిలీ విత్తనాలు అమ్మినట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయశాఖ అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలి.