
టీఆర్నగర్లో నీటి కటకట
● 20 రోజులుగా నిలిచిన భగీరథ నీటి సరఫరా
ఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని టీఆర్నగర్ కాలనీలో 20 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. కాలనీవాసులు కిలోమీటర్ దూరంలోని పెద్దవాగు నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలుషిత నీటితో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. టీఆర్నగర్ కాలనీలో 120 కుటుంబాలకు కేవలం ఒకే చేతిపంపు ఉంది. గంటల తరబడి నీటికోసం చేతిపంపు వద్ద నీటి కోసం వేచిచూడాల్సి రావడంతో కూలీ పనులకు వెళ్లలేకపోతున్నారు. కాలనీలో మరో బోర్ ఉండగా, మోటార్ చెడిపోయింది. ప్రతీ సారి తామే డబ్బులు జమ చేసి మరమ్మతులు చేయించుకుంటున్నామని, ప్రస్తుతం చెడిపోయిన మోటార్ను ఇప్పటికీ అధికారులు బాగు చేయించలేదని కాలనీవాసులు తెలిపారు. భగీరథ నీటిని సరఫరా చేయాలని, లేనిపక్షంలో కలెక్టరేట్ వద్ద ఖాళీ బిందెలతో ధర్నా చేపడతామని హెచ్చరించారు.