
కలెక్టరేట్ ఎదుట ‘ఉపాధి’ కూలీల ధర్నా
ఆసిఫాబాద్అర్బన్: సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ఉపాధిహామీ కూలీలు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధిహామీ కూలీలకు పని ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, కూలీల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. వేసవి భత్యం చెల్లించాలని, పనిముట్లు అందించాలని, ఖాళీలు ఉన్నచోట సీనియర్ మేట్లను ఎఫ్ఏలుగా నియమించాలన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న డీఆర్డీవో దత్తారావు కూలీలకు వద్దకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిందిస్థాయి అధికారులకు ఇప్పటికే మెమోలు జారీ చేశామని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బిల్లులు చెల్లించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం కూలీలు అదనపు కలెక్టర్ డేవిడ్కు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు దినకర్, టీకానంద్, అశోక్, శ్రీనివాస్, బక్కన్న, తిరుపతి, శ్రీకాంత్, స్రవంతి, రాజ్కుమార్, సందీప్, శంకర్, లక్ష్మి, గంగుబాయి, వసంతరావ్ పాల్గొన్నారు.