ఉద్యాన పంటలకు ఊతం | - | Sakshi
Sakshi News home page

ఉద్యాన పంటలకు ఊతం

May 30 2025 1:52 AM | Updated on May 30 2025 1:52 AM

ఉద్యా

ఉద్యాన పంటలకు ఊతం

● జిల్లాలో 31 హెక్టార్లలో పండ్ల తోటల సాగు లక్ష్యం ● రైతులను ప్రోత్సహించేందుకు సబ్సిడీపై పరికరాలు ● అవగాహన కల్పిస్తున్న అధికారులు

రెబ్బెన(ఆసిఫాబాద్‌): రైతులు పంటల సాగుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో వర్షాలు, సారవంతమైన భూములు, నాణ్యమైన విత్తనాలు, సకాలంలో సస్యరక్షణ చర్యలు.. ఇలా భూమిలో విత్తనం పడిన నాటి నుంచి పంట చేతికందే వరకు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయినా అన్నదాతలకు వ్యవసాయంలో లాభాలు కంటే నష్టాలే అధికంగా మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యానవన పంటలను ప్రోత్సహిస్తున్నాయి. జిల్లాలోని తేలికపాటి భూముల్లో పండ్ల తోటల సాగుతో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. దీంతో ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా రైతులకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తూ జిల్లావ్యాప్తంగా ఉద్యానవన పంటల సాగుకు ఊతం ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు.

ప్రత్యేక రాయితీలు, పరికరాలు

పండ్ల తోటల సాగులో నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. కొన్నిరకాల తోటలు వర్షాధారంగానే దిగుబడిని అందిస్తాయి. మిగిలిన తోటల్లోనూ తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకతను సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. బిందు, తుంపర సేద్యం పరికరాలు రాయితీపై అందిస్తోంది. తెలంగాణ సూక్ష్మ సేద్య పథకం( టీజీఎంఐపీ) పథకం ద్వారా ప్రభుత్వం పండ్ల తోటలు సాగుచేసే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతులకు వందశాతం సబ్సిడీ, బీసీ చిన్న సన్నకారు రైతులకు 90శాతం సబ్సిడీ, ఓసీ, ఇతర వర్గాలకు చెందినవారికి 80శాతం సబ్సిడీపై బిందుసేద్యం పరికరాలు అందిస్తున్నారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం 170 తుంపర సేద్యం పరికరాలను అందించాలని లక్ష్యం నిర్దేశించింది. అయితే తుంపర సేంద్యం పరికరాలను అన్నివర్గాల రైతులకు 75 శాతం రాయితీపై ప్రభుత్వం అందిస్తోంది. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో తోటలకు నీటికి అందించేందుకు రైతులకు ఇవి ఉపయోగకరంగా మారనున్నాయి. అలాగే వారిపై ఆర్థికభారం సైతం తగ్గనుంది.

తీగజాతి కూరగాయల సాగుకు..

పండ్ల తోటలపాటు కూరగాయల సాగులోనూ రైతులకు మంచి లాభాలు ఉంటాయి. కూరగాయల సాగుకు నీటి వనరులు ఎంతో ముఖ్యం. అందుబాటులో నీటి సౌకర్యం ఉన్న రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించేందుకు శాశ్వత పందిర్లను ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 20 యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్ణయించింది. అరెకరంలో శాశ్వత పందిరి నిర్మాణాన్ని ఒక యూనిట్‌గా అధికారులు నిర్ధారిస్తారు. తీగజాతి కూరగాయలైన బీర, కాకర, సోర, పొట్ల వంటి వాటిని శాశ్వత పందిర్ల సహాయంతో సాగు చేస్తే.. సాధారణ పద్ధతి కంటే ఎక్కువ దిగుబడి సాధించేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే జాతీయ వెదురు మిషన్‌ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 80 ఎకరాల్లో వెదురు తోటలు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

31 హెక్టార్లలో పండ్ల తోటలు

ఈ ఆర్థిక సంవత్సరంలో సమీకృత ఉద్యాన అభివృద్ది పథకం, నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడెబుల్‌ ఆయిల్‌ పామ్‌ పథకాల ద్వారా జిల్లాలో 31 హెక్టార్లలో వివిధ రకాల తోటల పెంపకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. కొత్త తోటల ఏర్పాటు ద్వారా జిల్లాలో పండ్ల తోటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. తోటల పెంపకంతో కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. తోట ఏర్పాటు చేసుకున్న సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు రాయితీని తోటల సంరక్షణ కోసం ప్రోత్సహకాన్ని ప్రభుత్వం నేరుగా రైతు బ్యాంకు ఖాతాలోనే జమచేస్తోంది. ఇక ఆయిల్‌పామ్‌ తోటలు సాగు చేసే రైతుకు ఎకరానికి రూ.4,200 చొప్పున నాలుగేళ్ల వరకు అందిస్తుంది. అందులో రూ.2,100 పంట సంరక్షణకు, మిగిలిన రూ.2,100 అంతర పంటల సాగు కోసం వినియోగించాల్సి ఉంటుంది.

సద్వినియోగం చేసుకోవాలి

పండ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాలు, రాయితీలను రైతులు సద్వి నియోగం చేసుకోవాలి. తేలికపాటి భూముల్లోనూ పండ్ల తోటలు ఏర్పాటు చేసుకుని లాభాలు సాధించవచ్చు. ఒక్కసారి తోట ఏర్పాటు చేస్తే దీర్ఘకాలికంగా ఫలాలు పొందే అవకాశం ఉంది. రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందిస్తోంది.

– ఎంఏ నదీం, ఉద్యానవన శాఖ అధికారి

2025– 26లో సాగు లక్ష్యం (హెక్టార్లలో)

డ్రాగన్‌ ఫ్రూట్‌ 2

బొప్పాయి 5

పనస 6

మామిడి 10

జామ 5

బత్తాయి 3

ప్లాస్టిక్‌ మల్చింగ్‌ 40

యాంత్రీకరణ ఇలా..

పరికరం మంజూరైన యూనిట్లు

పవర్‌ టిల్లర్‌ 6

పవర్‌ వీడర్‌ 6

బ్రష్‌ కట్టర్‌ 16

క్నప్సాక్‌ స్పేయర్‌ 6

జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు (ఎకరాల్లో)

వివిధ రకాల పండ్ల తోటలు 1311.84

కూరగాయలు 8,097.58

సుగంధ ద్రవ్యాలు 180.18

ఆయిల్‌పామ్‌ 1,334.68

ప్లాంటేషన్‌ పంటలు 246

పూల తోటలు 6.07

ఆగ్రో ఫారెస్ట్రీ 360.21

బార్డర్‌ ప్లాంటేషన్‌ 11

ఉద్యాన పంటలకు ఊతం1
1/1

ఉద్యాన పంటలకు ఊతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement