
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
రెబ్బెన(ఆసిఫాబాద్): అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండలంలోని ఎడవెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలిసి సందర్శించారు. కేంద్రానికి రైతులు తీసుకు వచ్చిన ధాన్యంలో తేమశాతాన్ని స్వయంగా పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా రైతుల అవసరం మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, కేటాయించిన ప్రకారం రైస్మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోళ్లలో జాప్యం చేయొద్దని సూచించారు. రైతులు ఆందోళనకు గురి కావొద్దని, కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ధాన్యంలో తప్ప, తాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఏపీఎం వెంకటరమణ శర్మ, రైతులు పాల్గొన్నారు.
యువ వికాసం ద్వారా ఉపాధి అవకాశాలు
ఆసిఫాబాద్అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50వేల నుంచి రూ.లక్షల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసి జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంజూరు పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.