
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
సాత్నాల: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన భోరజ్ మండలంలోని రాంపూర్(టి)లో గురువారం చోటు చేసుకుంది. జైనథ్ ఎస్సై గౌతమ్ పవార్ తెలిపిన వివరాల మేరకు జైనథ్ మండలం లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన శంకర్కు భోరజ్ మండలంలోని రాంపూర్(టి) గ్రామానికి చెందిన సురేఖ (35)తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కొంతకాలంగా శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి వచ్చి భార్యను వేధిస్తుండడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. బుధవారం రాత్రి మద్యం మత్తులో అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవకు దిగడంతో కుటుంబ సభ్యులు 100కు సమాచారం అందించారు. పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. గురువారం ఉదయం మరోసారి అత్తారింటికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. దీంతో మనస్తాపానికి గురైన సురేఖ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శంకర్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని, ఆమె భర్త ఉరివేసి హత్యచేశాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించారు. మృతురాలి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.