
వాటర్ ట్యాంకు ఎక్కి యువకుడి హల్చల్
నస్పూర్: తనకు న్యాయం చేయాలని ఓ యువకుడు గురువారం పట్టణ పరిధిలోని వాటర్ ట్యాంకు ఎక్కి హల్చల్ చేశాడు. ఎస్సై ఉపేందర్రావు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. ఈ సందర్భంగా బాధితుడు జాబ్రీ జమీల్ మాట్లాడుతూ తనది విలేజ్ నస్పూర్ గ్రామమని, నస్పూర్ శివారు సర్వే నంబర్ 22లోని 6 ఎకరాల భూమిని మహ్మద్ ఫిరోజ్ఖాన్, మరి కొందరితో కలిసి 2015 లో కొనుగోలు చేశామన్నాడు. అందులో తనకు పది శాతం వాటా ఉందన్నాడు. కొంతకాలం తర్వాత ఫిరోజ్ఖాన్ తన పదిశాతం వాటా కింద రూ.30 లక్షలు ఇస్తానని 2016లో అగ్రిమెంట్ చేసుకుని రూ.2.50 లక్షలు చెల్లించాడన్నారు. మిగిలిన డబ్బులు ఇవ్వకుండా భూమిని ఇతరులకు అమ్ముకున్నారని ఆరోపించారు. రెండు రోజుల్లో న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకుంటామన్నారు. అనంతరం యువకుడిని పోలీస్ స్టేషన్కు తరలించారు.