
వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ఆవిర్భావ వేడుకలు
ఘనంగా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో వేడుకల నిర్వహణపై బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టరేట్ను విద్యుత్ దీపాలతో అలంకరించాలని, చిల్డ్ర న్స్ పార్క్లోని అమరవీరుల స్తూపాన్ని ముస్తాబు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుధ్యం, ప్రముఖుల ప్రెస్ గ్యాలరీ ఏర్పాటు పనులు చేపట్టాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో వేడుకలు నిర్వహణ స్థలాన్ని పరిశీలించారు.
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలోని అడవితోపాటు వన్యప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత అని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్వో నీరజ్కుమార్ టిబ్రేవాల్తో కలిసి అటవీ రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా భూభాగంలో 56శాతం అటవీ ప్రాంతం ఉందని, అందులోని భూమి ఆక్రమణకు గురికాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వేటగాళ్లు విద్యుత్ తీగలతో వన్యప్రాణులను హతమారుస్తున్నారని, అడవుల గుండా వెళ్లే విద్యుత్ తీగలను రోడ్డు పక్క నుంచి వెళ్లేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందిరా సౌర గిరిజల శక్తి పథకం ద్వారా పోడు భూముల్లో బోర్లు వేసి సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. అటవీ, రెవెన్యూ సరిహద్దు వివాదాలకు పరిష్కారం చూపేందుకు సంయుక్త సర్వేలు నిర్వహించి, హద్దులు గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో విద్యుత్శాఖ అధికారి శేషారావు, సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ ప్రభాకర్, ఎఫ్ఆర్వోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
వనమహోత్సవం పకడ్బందీగా చేపట్టాలి
జిల్లాలో వనమహోత్సవం– 2025 కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, అటవీ శాఖ అధికారి నీరజ్కుమార్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి వనమహోత్సవం అమలుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 51 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించామని తెలిపారు. రుతుపవనాలు ముందే రావడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని, అధికారులు అనువైన స్థలాల్లో ఉపాధిహామీ కూలీల ద్వారా గుంతలు తవ్వించి మొక్కలు నాటించాలని సూచించారు. అధిక భాగం గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలకు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతిగౌడ్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.