
చేరువగా రైతు నేస్తం!
● ప్రస్తుతం జిల్లాలోని 15 రైతువేదికల్లోనే.. ● త్వరలో మరో 30 వేదికల్లో కార్యక్రమం ● ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ● ప్రభుత్వ ఉత్తర్వులు అందగానే అమలు
ఆసిఫాబాద్అర్బన్: రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు మండల కేంద్రంలోని రైతువేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతులకు సాగుకు అవసరమైన సలహాలు, సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుండడంతో కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు సంబంధిత శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతీ మండలంలో అదనంగా రెండు వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు.
కార్యక్రమ ఉద్దేశం ఏమంటే..
పంటల సాగులో రైతులకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించింది. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతుల ద్వారా తరగతులు నిర్వహించి పంటల సాగు, మెలకువలు, యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ చర్యల గురించి రైతులకు వివరిస్తున్నారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నూతన వ్యవసాయ సమాచారం చేరవేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుండడంతో రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులకు మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి దశలో మండలానికి ఒక రైతువేదికను ఎంపిక చేయగా.. అదనంగా మరో రెండు క్లస్టర్లకు విస్తరించనున్నారు. జిల్లాలో ప్రతీ 5వేల ఎకరాలకు ఒకటి చొప్పున 70 వ్యవసాయ క్లస్టర్లున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 15 రైతువేదికల్లో రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తుండగా నూతనంగా మరో 30 వేదికల్లోనూ నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఈ రైతువేదికల్లో..
జిల్లాలో ప్రస్తుతం 15 రైతు వేదికల్లోనే రైతు నేస్తం కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్, కెరమెరి, వాంకిడి, తిర్యా ణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), రెబ్బెన, పెంచికల్పేట్, దహెగాం, కౌటాల, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, బెజ్జూర్లోని రైతువేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆసిఫాబాద్లో రైతునేస్తం నిర్వహిస్తున్న రైతువేదిక
అదనంగా ఎంపిక చేసిన గ్రామాలివే..
మండలం ఎంపికై న గ్రామాలు
ఆసిఫాబాద్ చిర్రకుంట, రహపల్లి
కెరమెరి సాంగ్వి, సుద్దాపూర్
జైనూర్ లెండిజల, ఊశేగాం
వాంకిడి బంబారా, ఇందాని
సిర్పూర్ (యూ) సిర్పూర్(యూయ), పంగిడి
లింగాపూర్ కాంచన్పల్లి, లింగాపూర్
రెబ్బెన తక్కలపల్లి, నారాయణపూర్
తిర్యాణి గిన్నెదరి, మాణిక్యపూర్
కాగజ్నగర్ జంబూగ, దుర్గానగర్
సిర్పూర్(టి) చింతకుంట, వెంపల్లి
బెజ్జూర్ కుకుడ, ఔట్సారంగపల్లి
కౌటాల మొగడ్దగడ్, సాండ్గాంవ్
చింతలమానెపల్లి డబ్బా, రుద్రాపూర్
దహెగాం కుంచవెల్లి, గిరివెల్లి
పెంచికల్పేట్ కమ్మర్గాం, చేడ్వాయి
సద్వినియోగం చేసుకోవాలి
రైతువేదికల ద్వారా నిర్వహిస్తున్న రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పంటల సాగు పద్ధతులను తెలియజేస్తారు. రైతులతో నేరుగా చర్చించి సందేహాలను నివృత్తి చేస్తారు. అభ్యుదయ రైతుల అనుభవాలు చూపిస్తారు. దీంతో రైతుల్లో నమ్మకం పెరుగుతుంది. నూతనంగా ఎంపిక చేసిన రైతువేదికల్లో త్వరలో రైతు నేస్తం సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాబోయే రోజుల్లో రైతులకు మరింత మేలు జరుగుతుంది. – రావుల శ్రీనివాస్రావు,
జిల్లా వ్యవసాయాధికారి

చేరువగా రైతు నేస్తం!