
‘ఉపాధి’ సిబ్బంది వేతన వెతలు
కెరమెరి(ఆసిఫాబాద్): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న క్షేత్రసహాయకులకు జనవరి నుంచి ఏపీవో, టీఏ, ఇతర సిబ్బందికి ఫిబ్రవరి నుంచి వేతనాలు అందడం లేదు. ఇప్పటికే చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న వారికి సకాలంలో జీతాలు రాకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా పనులు నిర్వహించేందుకు నిరంతరం పర్యవేక్షణతో పాటు కూలీలకు పని కల్పించేందుకు కృషి చేస్తుంటారు. కూలీలతో సమానంగా ఎండలో విధులు నిర్వహిస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐసీతో పాటు కొత్తగా స్పర్షీ అనే సాఫ్ట్వేర్ను తీసుకువస్తున్న కారణంగా మూడు నాలుగు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు.
కొనసాగుతున్న నిరసనలు
ఏప్రిల్ 29 నుంచి ఉపాధి హామీ సిబ్బంది నిరసనలు ప్రారంభం అయ్యాయి. 29న జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించారు. 30న జిల్లాలోని ఆయా మండలాల్లో ఎంపీడీవోలకు దరఖాస్తులు అందజేశారు. ఈ నెల 1, 2 తేదీల్లో పెన్డౌన్ చేపట్టారు. 3న శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించారు. 5న ఉపాధి హామీ కూలీలు చేస్తున్న ప్రదేశాల్లో నిరసనలు చేపట్టనున్నారు. 6న ఉపాధి పనులను నిలిపివేస్తారు.
కుటుంబ పోషణ భారం
నాలుగు మాసాలుగా వేతనాలు అందక ఉపాధి హామీ సిబ్బందికి కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఇంటిపోషణ, అద్దెలు, ఈఎంఐలు, పాఠశాల ఫీజులకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇటీవల పెన్డౌన్ చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులు నిలిపివేస్తాం
ఉపాధి హామీ సిబ్బందికి వేతనాలు చెల్లించకుంటే ప నులు నిలిపివేస్తాం. గత నెల 29 నుంచి వివిధ రకా లుగా నిరసనలు చేస్తున్నప్పటికీ అధికారులు, ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఈనెల 6 నుంచి పూర్తిస్థాయిలో పనులు నిలిపివేసేందుకు రాష్ట్ర సంఘం నిర్ణయించింది.
– గోగు మల్లయ్య, ఈజీఎస్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో ఉపాధి హామీ సిబ్బంది వివరాలు
సిబ్బంది సంఖ్య
ఏపీవో: 11
ఈసీ: 06
సీవో: 37
టీఏ: 74
పీఎం: 01
హెచ్ఆర్ఎం: 01
టీడీ: 01
ఎఫ్ఏ: 150
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్: 41
మొత్తం: 322
నాలుగు మాసాలుగా అందని జీతాలు
భారమవుతున్న కుటుంబ పోషణ

‘ఉపాధి’ సిబ్బంది వేతన వెతలు