
వందశాతం అక్షరాస్యత సాధించాలి
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్: జిల్లాలో వందశాతం అక్షరాస్యత సాధించేందుకు అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్తో కలిసి విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నవభారత సాక్షరత కార్యక్రమంలో అక్షరాస్యత సాధనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఉల్లాస్ ఒకటని తెలిపారు. నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా పాఠశాలస్థాయిలో విద్యావకాశం కోల్పోయిన 15 సంవత్సరాలు, ఆ పైబడిన నిరక్షరాస్యులకు జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక అక్షరాస్యత, ప్రాథమిక విద్యతో పాటు డిజిటల్ అక్షరాస్యత కీలకమన్నారు. జీవన నైపుణ్యాలు, ఆర్థిక అక్షరాస్యత, వృత్తి నైపుణ్యాలతో నిరంతరం విద్యనందించడమే పథకం లక్ష్యమని తెలిపారు. చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, కనీస సామర్థ్యాలతో కూడిన లెక్కలు చేయడం నేర్చుకోవాలని సూచించారు. వయోజనులకు విద్యనందించేందుకు స్వచ్ఛంద బోధకులు అవసరమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తప్పనిసరిగా ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం, ఉన్నత పాఠశాల విద్య పూర్తయిన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలలో చేరే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. బడీడు గల పిల్లలెవరూ బడి బయట ఉండకూడదన్నారు. అక్షర్యాస్యతలో జిల్లాను ముందు వరుసలో ఉంచేందుకు సమష్టి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో ఇన్చార్జి డీఈవో యాదయ్య, డీఆర్డీవో దత్తారావు, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్వో సీతారాం, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, అదనపు డీఆర్డీవో రామకృష్ణ, విద్యాశాఖ అధికారులు ఉదయబాబు, మధుకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.