
గుండెపోటుతో ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి
భీమారం: మండల కేంద్రానికి చెందిన రామళ్ల సాగర్ ట్రెయినీ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. అతని బంధువులు తెలిపిన వివరాలు.. కొన్నినెలల క్రితం సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికై న సాగర్ (29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా కాలికి దెబ్బతగలంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో గతనెల 26న స్వగ్రామానికి వచ్చాడు. బంధువుల వివాహం ఉండటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి బుధవారం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ ఒక హోటల్ వద్ద కూర్చున్న సాగర్ అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వెంటనే గమనించి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాగర్ మృతితో భీమారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
గుండెపోటుతో సింగరేణి కార్మికుడు మృతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారెపల్లి రవీందర్ రెడ్డి (56) శాంతిఖని సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. టూటౌన్ ఎస్సై కె.మహేందర్ కథనం ప్రకారం..భార్య, పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి మంగళవారం రాత్రి భోజనం చేస్తూ కుర్చీలో కుప్పకూలిపోయాడు. బుధవారం ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్సిల్ రావడంతో విషయాన్ని భర్తకు చెప్పడానికి భార్య మంజు పలుమార్లు ఫోన్ చేసింది. లిఫ్ట్ చేయకపోవడంతో సహచర కార్మికుడికి ఫోన్ చేసి ఓసారి ఇంటికి వెళ్లి చూడాలంది. అతను వెళ్లి ఇంటి కిటికీ నుంచి చూడగా కుర్చీలో రవీందర్ రెడ్డి బిగుసుకుపోయి ఉన్నట్లు గుర్తించాడు. చుట్టుపక్క ఇళ్ల వారిని పిలిచి తలుపు పగులగొట్టి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులకు ఆయన సమాచారమిచ్చారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గేదెల మృతి కారకుడికి 9 నెలల జైలు
ఆసిఫాబాద్: విద్యుత్ తీగలు అమర్చి, నాలుగు గేదెల మృతికి కారణమైన తిర్యాణి మండలం చెలిమెల కొలాంగూడకు చెందిన టేకం కొండుకు 9 నెలల జైలుశిక్ష విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పుచెప్పారు. తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కథనం ప్రకారం.. తిర్యాణి నుంచి మాణిక్యాపూర్ వెళ్లే మార్గంలో గుట్టమేడి అటవీ ప్రాంతంలో జంతువులకోసం టేకం కొండు విద్యుత్ తీగలు అమర్చాడు. గ్రామానికి చెందిన కుర్రిసంగ భీమ్రావు, ఆత్రం భుజంగరావు, మడావి సోంబాయి, బొమ్మగోని విజయలకు చెందిన నాలుగు గేదెలు 2017 మే 31న మేతకు వెళ్లి తిరిగి రాలేదు. ఈక్రమంలో అటవీప్రాంతంలో గాలించగా విద్యుత్ తీగలు తగిలి మృతిచెంది ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బుద్దేస్వామి కేసు నమోదు చేశారు. రెబ్బెన సీఐ బుద్దేస్వామి, తిర్యాణి ఎస్సై శ్రీకాంత్ కోర్టులో సాక్షులు ప్రవేశపెట్టగా పీపీ జనన్మోహన్ రావు విచారించి నేరం రుజువుచేశారు. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు లైజనింగ్ అధికారి రాంసింగ్, కానిస్టేబుల్ వినోద్, పోలీసు అధికారులను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అబినందించారు.