పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్
ఖమ్మం మామిళ్లగూడెం : నిరుద్యోగ యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని పీవైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి.రాకేష్ అన్నారు. స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 1.90లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నేడు నిరుద్యోగుల వైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ అమలుకు నోచుకోలేదని, నిరుద్యోగ భృతి ఊసే లేదని అన్నారు. ఉద్యోగ సాధన కోసం ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల చుట్టూ తిరుగుతున్న నిరుద్యోగులు నోటిఫికేషన్లు లేక తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం కూడా.. పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాటోత్ ప్రేమ్సింగ్, జిక్కుల భరత్, ఉపాధ్యక్షుడు సీహెచ్ ధరణి కృష్ణ, నాయకులు గోడ్డెటి అశోక్, ఇస్లావత్ రమేష్, వెంకటేష్, కొత్త రమేష్ పాల్గొన్నారు.


