అండగా ఉంటాం.. | - | Sakshi
Sakshi News home page

అండగా ఉంటాం..

Mar 8 2026 7:53 AM | Updated on Mar 8 2026 7:53 AM

50వ డివిజన్‌లో ‘రిపోర్టింగ్‌’

మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ఆధ్వర్యంలో

ప్రత్యేక కార్యక్రమాలు

ఖమ్మంమయూరిసెంటర్‌: పారిశుద్ధ్య కార్మికులకు కేఎంసీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని మేయర్‌ పునుకొల్లు నీరజ భరోసాఇచ్చారు. ‘తెల్లవారుజాము నుంచే విధుల్లో నిమగ్నమవుతారు. ఆరోగ్యాలను పణంగా పెట్టి వీధులు శుభ్రం చేస్తుంటారు. దుమ్ము, ధూళిలో పనిచేస్తూ ప్రజలకు క్లీన్‌ ఖమ్మాన్ని ఇస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో మహిళా కార్మికులతో మేయర్‌ చర్చావేదిక నిర్వహించారు. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ సమస్యలను వివరించగా.. తక్షణమే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. అలాగే నగరంలోని 50వ డివిజన్‌ ఆర్టీసీ కాలనీలో మేయర్‌ రిపోర్టర్‌గా మారి, అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.

రక్షణ పరికరాలు వాడాలి..

‘మీ ఆరోగ్యంపైనే నగర ప్రజల ఆరోగ్యం ఆధారపడి ఉంది. పారిశుద్ధ్య పనులు నిర్వహించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ పరికరాలను ఉపయోగించాలి. కార్పొరేషన్‌ అందిస్తున్న గ్లౌజులు, బూట్లు, యాప్రాన్‌ తప్పనిసరిగా వాడాలి’ అని నీరజ సూచించారు. శనివారం తెల్లవారుజామునే కార్మికులు విధులకు హాజరు కాగా.. నగరంలోని బైపాస్‌ రోడ్డులో గల ఓ టీస్టాల్‌లో వారితో కలిసి మేయర్‌ టీ తాగారు. ఈ సందర్భంగా వారి సమస్యలు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నా రు. కేఎంసీ అందిస్తున్న సదుపాయాలు, విధులు నిర్వహిస్తున్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. విధి నిర్వహణ సమయంలో బూట్లు, గ్లౌజులు వేసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని సూచించారు. దీనిపై కార్మికులు మాట్లాడుతూ సామగ్రి అందడంలో ఆలస్యం అవుతోందని, మూడు నుంచి ఆరు నెలలకు ఒకసారి అందించాల్సి ఉందని అన్నారు. గ్లౌజులు, బూట్లు అందజేయాలని కోరారు. ఒకే జత యాప్రాన్‌ ఉందని, ఒకేసారి రెండు జతల యాప్రాన్లు ఇవ్వాలని, పెద్ద పండుగల సమయంలో సెలవులు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని కోరారు. దీనిపై స్పందించిన మేయర్‌ గ్లౌజులు, చీపుర్లు, యాప్రాన్లు ఇప్పించేలా కృషి చేస్తానన్నారు. పండుగల సమయంలో వెసులుబాటును బట్టి సెలవులు ఇవ్వాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ రాపర్తి శరత్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఏఈ ఎం.శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్లు, జవాన్లు జ్యోతి, స్వాతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మీ కాలనీలో సమస్యలున్నాయా..?

‘నగర పాలక సంస్థ అందిస్తున్న సేవలు ఎలా ఉన్నాయి..? మీ కాలనీలో పారిశుద్ధ్య, ఇతర సమస్యలేమైనా ఉన్నాయా..? అంటూ కేఎంసీ మేయర్‌ పునుకొల్లు నీరజ రిపోర్టర్‌గా మారి కాలనీ వాసులను ప్రశ్నించారు. నగరంలోని ఆర్టీసీ కాలనీలో శనివారం ఆమె మహిళలతో మాట్లాడారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ తరఫున వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానికులతో మాట్లాడుతూ తాను ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ పునుకొల్లు నీరజనని, సమస్యలుంటే తనకు వివరించాలని కోరారు.

మేయర్‌ : మీ కాలనీలో కేఎంసీ సేవలెలా ఉన్నాయి.?

స్థానికులు: కాలనీలో రోజువారీ చెత్త సేకరణ బాగా జరుగుతోంది. రోడ్ల సౌకర్యం బాగుంది. చిన్నచిన్న సమస్యలు మినహా ఇబ్బందులు లేవు. కాలనీలో సౌకర్యాలు బాగున్నాయి.

మేయర్‌ : డ్రెయిన్లు ఎలా ఉన్నాయి..? కార్మికులు శుభ్రం చేస్తున్నారా..?

స్థానికులు: డ్రెయిన్లలో చెత్త పేరుకుపోతోంది. రెగ్యులర్‌గా శుభ్రం చేయించడం లేదు. మూడు రోజులకు ఒకసారి క్లీన్‌ చేయించండి.

మేయర్‌ : చెత్త సేకరణ, మంచినీటి సరఫరాలో సమస్యలున్నాయా..?

స్థానికులు: ఇంటింటి చెత్త సేకరణకు ప్రైవేట్‌ వాహనాలు ఏర్పాటు చేశారు. అలా కాకుండా కార్పొరేషన్‌ వాహనాలను ఏర్పాటు చేయాలి. మంచినీటి సరఫరా ఇప్పుడు బాగానే ఉంది.

పారిశుద్ధ్య కార్మికులతో

చర్చావేదికలో మేయర్‌ నీరజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement