ఖమ్మంగాంధీచౌక్: భక్త జన సందోహం నడుమ నృసింహుడి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. స్వామి వారి జన్మనక్షత్రం(స్వాతి) సందర్భంగా ప్రతీ నెల నిర్వహించే ఈ వేడుక శనివారం సాయంత్రం స్తంభాద్రి గుట్టచుట్టూ నేత్రపర్వంగా సాగింది. అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలతో ఊరేగింపు నిర్వహించారు. నృసింహ నామ స్మరణతో భక్తులు కీర్తనలు ఆలపించారు. స్వామివారి పల్లకీని మోసేందుకు పలువురు ఆసక్తి కనబర్చారు. గిరి ప్రదక్షిణ అనంతరం స్వామి వారిని తిరిగి ఆలయానికి చేర్చారు. గుట్టపై ఉన్న రాతి కొండపై నక్షత్ర జ్యోతి(దివ్యజ్యోతి)ని అర్చకులు వెలిగించగా.. తిలకించిన భక్తులు పులకించిపోయారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున నృసింహ నామ స్మరణ చేశారు. ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
నక్షత్ర జ్యోతిని దర్శించి, తరించిన భక్తులు


