ఖమ్మంసహకారనగర్/వైరా/కొణిజర్ల: విద్యాశాఖలో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. 99 రోజుల ప్రణాళిక కట్టుదిట్టంగా నిర్వహించడంతో పాటు, రాబోయే 10వ తరగతి పరీక్షలో ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 15 వరకు ప్రతి పాఠశాలలో పనికిరాని సామగ్రి, కంప్యూటర్లు, రిజిస్టర్లు తొలగించాలని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేకంగా రూ.70 లక్షలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగే 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఈఓ చైతన్య జైనీ, విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ రామకష్ణ, ప్రవీణ్ పాల్గొన్నారు. వైరాలో పరిశుభ్రతను మెరుగుపరిచి పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు అఽధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ అనుదీప్ వైరా అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వైరా మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ, సంతోష్, విజేత, సురేశ్, సక్రునాయక్, గురులింగం పాల్గొన్నారు. కాగా, చిన్నగోపతి గ్రామంలో 100 శాతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అనుదీప్ మండల అధికారులు, గృహనిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం చిన్నగోపతిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ నెల 31 లోగా ఇళ్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాసరావు, డీఈ శ్రీరాంరెడ్డి, ఎంపీడీఓ వర్ష, ఎంపీఓ ఉపేంద్రయ్య, తహసీల్దార్ అరుణ, హౌసింగ్ ఏఈ ఉమామహేశ్వరరావు, సర్పంచ్ నాగేశ్వరరావు, వడ్డె నారాయణరావు రేఖ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పల్లిపాడు బస్స్టేజీ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఎవ్రీ ఛైల్డ్ రీడ్స్ కార్యక్రమ అమలును ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యాశాఖ సమీక్షలో కలెక్టర్ అనుదీప్


