ఫిర్యాదుల్లో కొన్ని..
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాల్సిందేనని తెలిపారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
శ్రీపాదరావు జయంతి
శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ అనుదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వి.మల్లేశ్వరి, షేక్ జానీమియా, అంజమ్మ, గిరిజను కలెక్టర్ సన్మానించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, ఎస్డీసీ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
కొణిజర్ల మండలం దుద్దుపూడికి చెందిన అమర్లపూడి భాస్కరరావు తమ భూమిని సబ్ స్టేషన్ కోసం కేటాయించగా హైకోర్టు కేసు కారణంగా స్థలం మార్చారని తెలిపారు. అయితే, కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఆ స్థలలాన్ని మున్సిపాలిటీ అధికారులు డంపింగ్ యార్డ్కు కేటాయించారని, మరోమారు పరిశీలించి తమ పేరిట పాస్ పుస్తకాల జారీ చేయాలని కోరారు.
నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామం పెద్దతండాకు చెందిన గిరిజనులు గత ప్రభుత్వం సర్వే నంబర్ 663లో ఆరు ఎకరాల స్థలం కేటాయించినందున బంజారా భవన్, సేవాలాల్ మందిరం నిర్మాణానికి అనుమతించాలని కొరకు వినతిపత్రం అందజేశారు.
చింతకాని మండలం బస్వాపురానికి చెందిన పాలకుర్తి బాలయ్య, రాధ తమ కుమారులు మనోజ్కుమార్(14), నరేంద్రకుమార్(12) అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నందున పెన్షన్ మంజూరు చేయాలని కోరారు.


