రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉంది
ఖమ్మంక్రైం : నేరాల నియంత్రణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ముందంజలో ఉందని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ ఫ్యామిలీ గృహ భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నివారణాత్మక పోలీసింగ్పై దృష్టి సారించాలని సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా పోలీస్ సిబ్బంది, వారి పిల్లలను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీస్ సిబ్బంది కుటుంబాలకు మెరుగైన వసతి కల్పించేందుకు జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో గృహాలు నిర్మించామని తెలిపారు. అనంతరం నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేసుల పురోగతి, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు. మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా నివారణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పదేళ్లుగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ సమస్య కాదని అన్నారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన సైబర్ సింబా కార్యక్రమాన్ని జిల్లాలో కూడా అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చేపట్టిన ఆరైవ్, ఆలైన్ కార్యాక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీబ్యూరో, ఈగల్ దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నాయని అన్నారు. బేసిక్ పోలీసింగ్, చట్టాలపై లోతైన అవగాహన కోసం దృష్టి పెట్టాలని, పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సునీల్దత్, అడిషనల్ డీసీపీలు ప్రసాద్రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్సింగ్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
డీజీపీ శివధర్రెడ్డి వెల్లడి


