రైతులు బేజారు..
బోటు షికారు కోసమట..
ఎకో టూరిజం పేరిట సాగునీరు బంద్
బోటు షికారు కోసం పులిగుండాల తూము మూసివేత
సాగునీరు అందక 1,200 ఎకరాల్లో వరికి ముప్పు
అటు
షికారు..
కల్లూరురూరల్: పెనుబల్లి మండలంలోని పులి గుండాల ప్రాజెక్టు, పరిసర అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా తీర్చిదిద్దుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా బోటు షికారు సాఫీగా సాగేలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీరు వెళ్లకుండా తూము మూసివేశారు. దీంతో కల్లూరు మండలంలో ఉన్న ఆయకట్టు రైతులు వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందుతున్నారు.
యాసంగి పంటలకు నీరేది?
కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో 250 ఎకరాలు, పెనుబల్లి మండలంలోని బ్రహ్మాళ్లకుంటలో 500 ఎకరాలు, తాళ్లపెంటలో 450 ఎకరాల ఆయకట్టులో పులిగుండాల ప్రాజెక్టు ఆధారంగా పంటలు సాగవుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వరి పంటలకు పుష్కలంగా నీరు అందించినా, యాసంగి పంటకు మాత్రం సాగునీరు నిలిపివేశారు. ఫలితంగా ప్రాజెక్టు నీటినే నమ్ముకుని రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోయే దశకు చేరుతోంది. అయితే, పులిగుండాల ప్రాజెక్టును సాగునీటి అవసరాల కోసమే నిర్మించారని, కనకగిరి గుట్టల నుంచి వృథాగా వెళ్లే నీటికి ఆనకట్ట వేసి కాల్వల ద్వారా ఆయకట్టుకు అందించాలనేది లక్ష్యమని రైతులు చెబుతున్నారు. 30 ఏళ్లుగా తాము ప్రాజెక్టును నమ్ముకుని వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు నీటిని నిలిపివేయడం సరికాదని పోపోతున్నారు.
10 అడుగుల మేర నీరు
ప్రాజెక్టులో ప్రస్తుతం పది అడుగుల మేర నీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని కనీసం తూము వరకై నా నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఫలితంగా వరి పంట చేతికొస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు అధికారులు స్పందించాలని ఆయకట్టు రైతులు లక్కిరెడ్డి ఏసురెడ్డి, జరుపుల వెంకన్న తదితరులు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అవసరమైతే కొద్దిరోజులు బోటు షికారు నిలిపివేయాలని సూచిస్తున్నారు.
పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం అభివృద్ధిలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల కోసం బోటు షికారు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అయితే, సాగు అవసరాలకు నీరు వదిలిపెడితే ప్రాజెక్టులో నీరు తగ్గి బోటు షికారు సాధ్యం కాదనే అభిప్రాయానికి అధికారులు వచ్చినట్లు తెలిసింది. ఫలితంగా సాగునీరు వెళ్లకుండా తూములు మూసివేయడంతో సుమారు 1,200 ఎకరాల్లో వరి పంటపై ప్రభావం పడుతోంది.


