కరుణగిరిలో కొనసాగుతున్న ఉత్సవాలు
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపాలిటీలోని కరుణగిరి చర్చిలో శనివారం ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరిసింది. కరుణగిరి మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. అలాగే, విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం మంగళగిరి డివైన్ మెర్సీ సెంటర్ ఫాదర్ జైసన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మేత్రాసనం ఫాదర్ తప్పెట శౌరి, కరుణగిరి డైరెక్టర్ ఫాదర్ జాన్నేశ్ తదితరులు పాల్గొన్నారు.
సేవాలోపానికి
పరిహారం చెల్లించాలి
ఖమ్మంలీగల్: టీవీ పనిచేయకపోవడం వెనుక కంపెనీ, డీలర్ సేవల్లో లోపం ఉందని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తేల్చింది. ఈ మేరకు పరిహారం చెల్లించాలని కమిషన్ ఇన్చార్జ్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు మాధవీలత శనివారం తీర్పు చెప్పారు. కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన తుప్పతి మల్లికార్జునరావు సామ్సంగ్ ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేయగా మొదటి రోజు నుంచే సరిగా పనిచేయకపోవడంతో కంపెనీ ప్రతినిధులకు ఫిర్యాదు చేశాడు. అయినా స్పందన రాకపోవడంతో న్యాయవాది బండారు నరేశ్ ద్వారా లీగల్ నోటీస్ పంపించి కమిషన్లో కేసు వేశాడు. విచారణ అనంతరం కొత్త టీవీ ఇవ్వడమే కాక మానసిక వేదనకు రూ.10 వేలు, న్యాయఖర్చులకు రూ.10 వేలు చెల్లించాలని తీర్పు చెప్పారు.
నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటన
ఖమ్మంమామిళ్లగూడెం: ఖమ్మం వెలుగుమట్ల లో ఇటీవల కూల్చివేసిన ఇళ్లను ఆదివారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ పరిశీలించనున్నారు. భూదాన్ భూము ల్లో ఇళ్లు నిర్మించుకున్న వారిలో పలువురు గిరిజనులు ఉండగా, వారికి పునరావాసం కల్పించకుండా కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో క్షేత్రస్థాయి లో పరిశీలన, బాధితులను పరామర్శించేందుకు హుస్సేన్నాయక్ వస్తున్నారని నాయకులు తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ
నేలకొండపల్లి: పారిశుద్ధ్య నిర్వహణలో ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి శనివా రం ఆయన పంచాయతీ కార్యదర్శులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీజనల్ వ్యాధుల కట్టడికి పారిశుద్ధ్యమే కీలకమని తెలిపారు. కాగా, ప్రభుత్వం నుంచి ఇటీవల విడుదలైన నిధుల నుంచి మాజీ సర్పంచ్లు చేసిన పనుల బిల్లులు చెల్లించాలని సూచించారు. వ్యక్తిగత, ఇతరత్రా కారణాలతో బిల్లులు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు. అలాగే, మార్చి నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలని, వీధి కుక్కల కట్టడిపై దృష్టి సారించాలని కార్యదర్శులకు సూచించారు. అంతేకాక వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ రూపొందించాలని డీపీఓ తెలిపారు. సమావేశంలో డీఎల్పీఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ ఎం.యర్రయ్య పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్ పనుల పరిశీలన
ఎర్రుపాలెం: మండలంలోని రాజుపాలెంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యాన నిర్మిస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్ను సెర్ప్ కన్సల్టెంట్ శ్రీధర్గుప్తా, రెడ్కో జిల్లా మేనేజర్ అజయ్ శనివారం పరిశీలించారు. ప్లాంట్ పురోగతిపై ఆరా తీసిన వారు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తవగా, మిగతావి కూడా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ఆలేటి శ్రీనివాస్, ఏపీఎం హరినారాయణ, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
నేలకొండపల్లి: ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తీసుకొస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు శనివారం సీజ్ చేశారు. ఏపీలోని మల్కాపురం నుంచి మండలంలోని బోదులబండ వైపు ఇసుకతో వస్తున్న ట్రాక్టర్లను తనిఖీ చేయగా అనుమతి లేదని తేలింది. దీంతో ట్రాక్టర్లను సీజ్ చేయడమే కాక డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు.
కరుణగిరిలో కొనసాగుతున్న ఉత్సవాలు


