మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
వైరా: వైరాలోని మత్స్య శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల్లో ఉద్యోగుల నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణలో లోపాలు ఉన్నాయనే ఫిర్యాదులతో తనిఖీకి వచ్చామని ఏసీబీ డీఎస్పీ రమేష్బాబు తెలిపారు. ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్న అధికారులు పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడమే కాక రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమేష్బాబు మాట్లాడుతూ 2022లో మత్స్యశాఖ సొసైటీల నుంచి రూ.50వేల లంచం తీసుకుంటూ అప్పటి ఎఫ్డీఓ బుచ్చిబాబు పట్టుబడ్డాడని తెలిపారు. ఆనాటి రికార్డులతో పాటు ఇతర పత్రాలను పరిశీలన నిమిత్తం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పది మండలాల పరిధితో కొనసాగుతున్న వైరా ఎఫ్డీఓ కార్యాలయం కింద 55 సొసైటీలు ఉండగా పర్యవేక్షణ లోపం, రికార్డుల్లో అవకతవకలను గుర్తించామని తెలిపారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు పనుల కోసం లంచం అడిగితే 1064 నంబర్కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.
ఇసుక అక్రమ రవాణా కట్టడికి చెక్పోస్ట్
చింతకాని: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తూ తరచుగా వాహనాలు పట్టుబడుతుండడంతో పూర్తిస్థాయిలో కట్టడికి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈమేరకు చింతకాని మండలం చిన్నమండవ లో పోలీస్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యాన శుక్రవారం చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వీరేందర్ మాట్లాడుతూ చిన్నమండవ మున్నేరు నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చెక్పోస్ట్ ఏర్పాటు చేశామని, ఇక్కడ పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. చిన్నమండవ, తిమ్మినేనిపాలెం మున్నేరులోకి ట్రాక్టర్లు వెళ్లకుండా కందకాలు తీయించడంతో పాటు రాత్రివేళ కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలించే వాహనాలను సీజ్ చేయడంతో పాటు డ్రైవర్లు, యజమానులపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై తెలిపారు.
మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు


