పకడ్బందీగా కేంద్ర పథకాల అమలు
ఖమ్మం సహకారనగర్: అర్హులకు లబ్ధి చేకూరేలా కేంద్రప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని దిశ కమిటీ చైర్మన్, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ఎంపీఽ అధ్యక్షతన దిశ(జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, కల్లూరు సబ్కలెక్టర్ అజయ్యాదవ్, జెడ్పీ సీఈఓ దీక్షారైనాతో పాటు సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నివేదికల పరిశీలన.. సూచనలు
వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కేంద్రపథకాల వివరాలను అధికారులు వివరించారు. అనంతరం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీ రామ్జీ పథకం మార్గదర్శకాలు ప్రజాప్రతినిధులందరికీ అందిచాలని సూచించారు. అలాగే, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, ఆస్పత్రుల్లో పోస్టుల భర్తీపై దృష్టి సారించడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవ సమయాన శస్త్రచికిత్సల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఐటీఐ, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాలపై అవగాహన కల్పించామని, సెంట్రల్ టూల్ డిజైన్ సెంటర్కు కేంద్రం నిధులు సాధించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారీ కోసం ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తుండగా, వైరాలో మూడు వారాల్లోగా డంప్ తొలగిస్తామని చెప్పారు. అలాగే, పోడు భూముల్లో బోర్లు వేయడం, జిల్లాలోని 9–14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను వివరించారు.
●అధికార యంత్రాంగం ప్రొటోకాల్ పాటించాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. వికసిత్ భారత్ జీ రాంజీ పథకంతో కూలీలకు పనివేళలు తగ్గాయా నివేదిక ఇవ్వాలని తెలిపారు. అలాగే, ఉపాధి హామీ పనుల పురోగతి, బకాయిలు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీ సెక్షన్ డెలివరీల తగ్గింపు, ఎన్హెచ్ పనుల్లో వేగంపై దృష్టి సారించాలని చెప్పారు. .
●ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతుల పొలాల్లో బోర్లు వేసుకోవడంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పనలో ఇబ్బందులు రాకుండా చూడాలని వైరా ఎమ్మెల్యే రాందాస్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో కొందరికి మధ్యలో ఎల్ 1 నుంచి ఎల్ 3 మారిస్తే ఇబ్బంది పడుతున్నారన్నారు. మొదటి దశలో మంజూరైన ఇళ్లు వేసవిలో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. అలాగే, దిశ కమిటీ సభ్యురాలు, కారేపల్లి మండలం పోలంపల్లి సర్పంచ్ ధరావత్ హేమలత మాట్లాడుతూ పోచారం రైల్వేస్టేషన్ నుంచి తడికలపూడి స్టేషన్ వరకు రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, కారేపల్లి–ఇల్లెందు మార్గంలో రైల్వేగేట్ కారణంగా ఇబ్బందులు వస్తున్నందున ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు.
●మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీల వద్ద మరమ్మతులు పూర్తిచేసి వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలిపారు. సత్తుపల్లి ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుల డిప్యూటేషన్ రద్దు చేయాలని, అంబులెన్స్ డ్రైవర్ పోస్ట్ మంజూరు చేయడమేకాక అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
‘దిశ’ కమిటీ సమావేశంలో
ఎంపీ రఘురాంరెడ్డి
పకడ్బందీగా కేంద్ర పథకాల అమలు


