త్వరలోనే ఎంపీఈడీ కోర్సు?
అనుమతి కోరాం..
అసౌకర్యాలను అధిగమిస్తూ..
● తొలుత 40 సీట్లతో ప్రారంభం ● ఖమ్మం ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ నుంచి ప్రతిపాదనలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో త్వరలోనే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(ఎంపీఈడీ) కోర్సు మొదలయ్యే అవకాశముంది. ఈమేరకు ప్రతిపాదనలు పంపించగా, అనుమతులు రాగానే వచ్చే ఏడాది నుంచే కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
11బ్యాచ్లు పూర్తి
ఖమ్మంలో 2013లో 60మందితో బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు కాలేజీలో 11 బ్యాచ్లు పూర్తయ్యాయి. ఇందులో బీపీఈడీ పూర్తిచేసిన వారు ఎంపీఈడీ చదివే అవకాశం లేక ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. పలువురు కష్టనష్టాలకోర్చి ఎంపీఈడీతో పాటు పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో వంద మంది చొప్పున బీపీఈడీ కోర్సులో ఉన్నారు. ఈనేపథ్యాన ఖమ్మంలోనే ఎంపీఈడీ కోర్సు ప్రారంభిస్తే అభ్యర్థులు దూరప్రాంతాలకు వెళ్లే ఇక్కట్లు తప్పనున్నాయి. ఈమేరకు 40సీట్లతో కోర్సుకు అనుమతించాలని కోరడంతో పాటు కాలేజీలో సెమినార్ హాల్కు రూ.1.25కోట్లు, హాస్టల్ నిర్మాణానికి రూ.3.75 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించారు.
కాలేజీలో అధ్యాపకుల కొరత ఉంది. ఖాళీల భర్తీ కోసం యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపాం. అలాగే, ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరాం. అనుమతి వస్తే బీపీఈడీ పూర్తి చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.
– డాక్టర్ సీహెచ్.రవికుమార్,
ప్రిన్సిపాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల
ఇప్పటి వరకు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో అరకొర సౌకర్యాలే ఉన్నాయి. అయినా అధ్యాపకుల చొరవతో అభ్యర్థులకు శిక్షణ సాఫీగా సాగుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే అభ్యర్థులు ప్రవేశాలు పొందుతుండగా.. బీపీఈడీలోనూ సీట్లు పెంచాలనే డిమాండ్ ఉంది. పీజీ కళాశాల మైదానం అందుబాటులోకి రావడం, బాస్కెట్బాల్ సిమెంట్ కోర్టు త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. ఈనేపథ్యాన అన్ని అనుకూలతలు ఉన్నందున ఎంపీఈడీ కోర్సు ప్రవేశపెట్టాలని పలువురు కోరుతున్నారు.
త్వరలోనే ఎంపీఈడీ కోర్సు?
త్వరలోనే ఎంపీఈడీ కోర్సు?


