ముంచిన మొక్కజొన్న సీడ్!
అశ్వారావుపేటరూరల్: మొక్కజొన్న విత్తనాలతో అధిక దిగుబడితోపాటు టన్ను ధర భారీగా వస్తుందని ఓ ఆర్గనైజర్ ఆశ చూపించడంతో సాగు చేసిన కౌలు రైతుకు భారీ నష్టం వాటిల్లింది. బాధిత రైతు కథనం ప్రకారం.. మండలంలోని మామిళ్లవారిగూడేనికి చెందిన కూరపాటి నరేశ్ గతేడాది అక్టోబర్లో ఇదే మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని దమ్మపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ ఆర్గనైజర్ ద్వారా మొక్కజొన్న పంట సాగు చేశాడు. కాగా, సీడ్ ఇచ్చే సమయంలో ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.34 వేలు చొప్పున ధర ఇస్తామని చెప్పారు. తీరా పంట చేతికంది, 10 ఎకరాల్లో పంట కోయగా.. మొక్కజొన్న కండెలో గింజలు పూర్తిస్థాయిలో రాకపోవడం, అంతంత మాత్రంగానే గింజలు రావడంతో ఎకరానికి క్వింటా దిగుబడి మాత్రమే వచ్చినట్లు రైతు వాపోతున్నాడు. ఆశించినస్థాయిలో దిగుబడి రాకపోవడంతో ఒక ఎకరానికి రూ.80 వేల దాకా నష్టం రాగా, ఇరవై ఎకరాలకు దాదాపు రూ.14 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ఈ విషయాన్ని సీడ్ సరఫరా చేసిన దమ్మపేట మండలానికి చెందిన సదరు ఆర్గనైజర్కు చెబితే తనకు సంబంధం లేదని, సీడ్కు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేయడంతో బాధిత రైతు దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు. కాగా, సదరు ఆర్గనైజర్ అశ్వారావుపేట మండలంలో మరో వంద ఎకరాలకు సీడ్ సరఫరా చేసినట్లు ప్రచారం సాగుతుండగా, ఆయా రైతుల్లో కుడా ఆందోళన నెలకొంది. తనను మోసం చేసిన ఆర్గనైజర్పై వ్యవసాయ, పోలీస్ శాఖ దృష్టిపెట్టి న్యాయం చేయాలని బాధిత రైతు కోరుతున్నాడు.


