తీర్థాల జాతరలో పకడ్బందీ భద్రత
ఖమ్మంరూరల్: మండలంలోని తీర్థాలలో మహా శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్టమైన భద్రత కల్పించనున్నట్లు అడిషనల్ డీసీపీ ప్రసాద్రావు తెలిపారు. తీర్థాల జాతర ఆవరణ, పరిసరాలను రూరల్ ఏసీపీ తిరుపతిరెడితో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశమున్నందున అదనపు బలగాలతో భద్రత ఏర్పాటుచేస్తామని తెలిపారు. అనంతరం ఆలయ స్వాగత ద్వారం మొదలు గర్భాలయం వరకు వేస్తున్న క్యూలైన్లు, చలువ పందిళ్లను పరిశీలించారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటు, పార్కింగ్, బారికేడ్లు ఏర్పాటుపై సూచనలు చేశారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


